తెలంగాణ

telangana

ETV Bharat / city

కారు స్వాధీనంపై సీఎంవో ఆరా.. వాహనం తీసుకెళ్లాలని సూచన - AP CMO inquiry on convoy incident

AP CMO inquiry on Convoy : ఏపీలోలి ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్​పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. పూర్తి వివరాలు సేకరించి.. కారు తీసుకెళ్లాలని డ్రైవర్​కు సూచించినట్లు సమాచారం.

AP CMO inquiry on Convoy
AP CMO inquiry on Convoy

By

Published : Apr 21, 2022, 10:27 AM IST

AP CMO inquiry on Convoy : ఒంగోలులో బుధవారం రోజున తిరుపతి వెళ్లే ప్రయాణికుడి కారు స్వాధీనం ఘటనపై ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది.

అసలేం జరిగిందంటే.. :తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్‌ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.

ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదని ఆవేదన చెందారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details