తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2022, 5:04 PM IST

Updated : Mar 19, 2022, 7:37 PM IST

ETV Bharat / city

ఎల్లుండి టీఆర్​ఎస్​ఎల్పీ భేటీ... అనంతరం దిల్లీకి సీఎం, మంత్రుల బృందం

kcr
kcr

17:03 March 19

ఈ నెల 21న తెరాస శాసనసభాపక్ష సమావేశం

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా సోమవారం కార్యాచరణ ఖరారు చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం హస్తిన పయనం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల అంశంపై విస్తృతంగా చర్చించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్​ రావు, ప్రశాంత్ రెడ్డి, సబిత, జగదీశ్​ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందే...

యాసంగిలో ధాన్యం సాగు, కొనుగోళ్ల అంశంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనన్న సీఎం కేసీఆర్... ఈ విషయంలో క్షేత్రస్థాయి నుంచి దేశ రాజధాని వరకు పోరాటం చేయాలని మంత్రులకు స్పష్టం చేశారు. వరి ధాన్యాన్ని సేకరించే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసి విజయవంతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం సోమవారం తెరాస పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పంజాబ్ తరహాలోనే తెలంగాణలో కూడా..

రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం తెలిపారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం అదే రోజు దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశం మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి డిమాండ్ చేయనున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా పార్లమెంట్ ఉభయసభల్లో తెరాస ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో పండుతున్న వరిధాన్యాన్ని కూడా భారత ఆహారసంస్థ (ఎఫ్​సీఐ) వందశాతం సేకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

మరోసారి సమావేశం

రాష్ట్ర రైతుల జీవన్మరణ సమస్యైన వరి ధాన్యం కొనుగోలుపై ఉద్ధృత పోరాటాలకు తెరాస సన్నద్ధమవుతోందని... సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాలపై కూడా మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. వారం రోజుల్లో 20 నుంచి 30వేల వరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ దిశగా అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తెరాసను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణం, సంబంధిత అంశాలపై మరోమారు అందరితో సమావేశం అవుతానని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి :మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ

Last Updated : Mar 19, 2022, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details