తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 5:12 AM IST

ETV Bharat / city

వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగమాగం చేస్తోంది: కేసీఆర్​

దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగమాగం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ఏ కోణంలోనూ రైతులకు మేలుచేసేవి కావన్న ఆయన... కేంద్ర విధానాలను నిలదీయటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

cm kcr fire on central govt
వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగమాగం చేస్తోంది: కేసీఆర్​

వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. నష్టదాయక కేంద్ర విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధిస్తుందన్నారు. సర్వే ఫలితాలు మన విజయఢంకాను సూచిస్తున్నాయన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. ‘నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. తెరాస ప్రభుత్వ విధానాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పార్టీని గెలిపిస్తాయి. విపక్షాలకు భంగపాటు తప్పదు’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌; వరంగల్‌-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్ర స్థానాలను మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మంత్రులు ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను స్వీకరించి పనిచేయాలని సూచించారు.

‘‘వ్యవసాయం అత్యంత కీలకమైన రంగం. దీనిని కేంద్రం ఆగమాగం చేస్తోంది. అన్నదాతలకు నష్టదాయకమైన కొత్త విద్యుత్‌ చట్టం తెస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలు కూడా ఏ కోణంలోనూ రైతులకు మేలు చేసేవి కావు. దేశంలో భారీఎత్తున నిల్వలున్నా ఇప్పుడు మక్కలను దిగుమతి చేసుకోవడం దారుణం. కేంద్ర విధానాలను నిలదీయడానికి వెనుకాడం. రాష్ట్రంలో రైతులను దీనిపై చైతన్యవంతం చేయాలి. కేంద్ర విధానాలతో సంబంధం లేకుండా అన్నదాతలకు అండగా నిలుస్తాం. - కేసీఆర్​, ముఖ్యమంత్రి.

మహిళా మంత్రుల కృతజ్ఞతలు

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయంపై మంత్రులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ చీరలను వరుసగా నాలుగోసారి పంపిణీ చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

ఆస్తుల నమోదుకు మంచి స్పందన

ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతీ ఒక్కరు సహకరిస్తున్నారు. భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ఆదరణ లభిస్తోంది. విపక్షాలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయి. దీనిని తిప్పికొట్టాలి. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రస్తుత రుసుంను భారంగా భావిస్తే దానిపై ఆలోచన చేస్తాం’’ అని సీఎం చెప్పారు.

ఇవీ చూడండి:చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

ABOUT THE AUTHOR

...view details