ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో... కాసేపట్లో నీతిఆయోగ్ ఆరో పాలకమండలి భేటీ అయింది. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగం, మానవవనరుల అభివృద్ధి, కిందిస్థాయిలో సేవలు, వైద్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై సమావేశంలో.. విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యేకించి కొవిడ్, తదనంతర పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిసారిస్తారు. ఈ సమావేశంలో... రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది.
రాష్ట్ర విజయాలను వివరించనున్న సీఎం
వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు తెలుపుతూ సంక్షిప్త నివేదికలు సిద్ధంచేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, విధానాలతో... నివేదికలను రూపొందించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలైన... టీఎస్- ఐపాస్, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతుబంధు తదితర పథకాల తీరుతెన్నులు పొందుపర్చారు. ఆయారంగాల్లో రాష్ట్ర విజయాలతో పాటు నీతిఆయోగ్ ఇచ్చిన ర్యాంకుల వివరాలను సిద్ధంచేశారు.