తెలంగాణ

telangana

ETV Bharat / city

Nadu-Nedu:'నాడు-నేడు' బడులను ప్రజలకు అంకితం చేయనున్న ఏపీ సీఎం

ఏపీలో 'నాడు - నేడు' కింద తొలివిడతలో రూపుమారిన పాఠశాలలను ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ఇవాళ ప్రజలకు అంకితం చేయనున్నారు. రెండో దశను ప్రారంభించనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ఏపీవ్యాప్తంగా బడుల పునఃప్రారంభం సందర్భంగా.. ఈ ఏడాది నుంచే నూతన విద్యావిధానం అమలు దిశగా సంస్కరణలు అమలు చేయనున్నారు.

By

Published : Aug 16, 2021, 6:37 AM IST

ap cm jagan, nadu nedu program in andhra pradesh
నాడు-నేడు కార్యక్రమం, ఏపీ సీఎం జగన్

నాడు-నేడు కార్యక్రమం

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'నాడు-నేడు' పథకం తొలి దశ పూర్తయింది. 60,469 బడులు, వసతిగృహాలు, కళాశాలలకుగానూ.. తొలివిడతలో 15,715 పాఠశాలల్లో 3,669 కోట్లతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, చిన్న, పెద్ద మరమ్మతులు లాంటి పనులతో విద్యాసంస్థల ఆవరణను ఆహ్లాదంగా తీర్చిదిద్దింది. తొలిదశ ఆధునికీకరణ, గదుల నవీకరణ పూర్తయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం.. తొలి దశలో పనులు పూర్తి చేసుకున్న బడులను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉదయం 11:25 నిమిషాలకు పాఠశాలకు చేరుకోనున్న జగన్.. అక్కడే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయన పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం పలుమార్లు ఆటంకం కలిగించినా ఏర్పాట్లను పూర్తి చేశారు.

హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాకానుక..

రెండో విడత నాడు-నేడు పనులకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. నూతన విద్యావిధానాన్ని అనుసరించి.. రానున్న రెండేళ్లలో బడులు, హాస్టళ్లు, కళాశాలల్లో 16,021కోట్లకుపైగా పనులకు వెచ్చించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సర్కారీ బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాకానుక కింద కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికీ 3 జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, స్కూల్‌ బెల్టు, మాస్కులు అందించనున్నారు. ఈ ఏడాది వీటికి అదనంగా డిక్షనరీ పంపిణీకి నిర్ణయించారు. 1 నుంచి 5వ తరగతి వారికి ఎన్​సీఈఆర్​టీ రూపొందించిన డిక్షనరీని.. 6నుంచి 10వ తరగతి వారికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇవ్వనున్నారు.

సిలబస్‌ మార్చాలని నిర్ణయం..

ఈ ఏడాది నూతన విద్యావిధానం అమలు చేస్తూ బోధనలో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫౌండేషన్‌ స్థాయి నుంచే పిల్లల సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. ఏపీ సంస్కృతిని తెలియజేసేలా పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు ముద్రించనున్నట్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో నూతన విద్యా విధానం అమలు చేయనుంది. మెరుగైన అవకాశాల కోసం విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాల్సిన పరిస్థితుల దృష్ట్యా.. ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్‌తో పాటు పరీక్షా విధానాన్ని కూడా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్​ఈకీ దశలవారీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

ABOUT THE AUTHOR

...view details