తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడు నెలలకే మూతపడ్డ పోలీస్ ఔట్ పోస్ట్! - Closed police outpost in Chittoor district updates

ఏపీలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల ముందు ఏర్పాటు చేసిన పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ మూడు నెలలకే మూతపడింది. ఆ సంస్థల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా 24 గంటలు పోలీసు నిఘా ఉంటుందని అవుట్‌పోస్ట్‌ ప్రారంభించారు.

closed-police-outpost-in-chittoor-district
మూడు నెలలకే మూతపడ్డ పోలీస్ ఔట్ పోస్ట్!

By

Published : Mar 22, 2021, 3:43 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల ముందు గతేడాది నవంబరు 11వ తేదీన అప్పటి తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్​‌రెడ్డి, సినీనటుడు మోహన్‌బాబు కలసి అట్టహాసంగా అవుట్‌పోస్ట్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా 24 గంటలు పోలీసు నిఘా కోసం అవుట్‌పోస్ట్‌ ప్రారంభించామని ఎస్పీ రమేశ్​‌రెడ్డి వివరించారు. స్థానిక పోలీసులు ఒకరిద్దరు సిబ్బందిని అడపాదడపా విధి నిర్వహణకు కేటాయించారు. నెల రోజులుగా పోలీసు సిబ్బంది ఎవరూ అవుట్‌ పోస్ట్‌ విధులకు రాకపోవడం వల్ల అక్కడి తలుపులు శాశ్వతంగా మూతవేశారు.

శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల యాజమాన్యం సుమారు రూ.5 లక్షల మేరకు ఖర్చు చేసి పోలీసులకు అవసరమైన అన్ని వసతులతో అవుట్‌పోస్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయించింది. నిరంతరం విధులు నిర్వహిస్తామన్న పోలీసులు.. విధులకు దూరం కావడం వల్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవుట్‌పోస్ట్‌ కేందాన్ని ప్రారంభించిన ఎస్పీ రమేశ్​రెడ్డి బదిలీపై వెళ్లటం, ఆయన స్థానంలో వచ్చిన వెంకటఅప్పలనాయుడుకు విషయం తెలియకపోవడం వల్ల చంద్రగిరి పోలీసులు అవుట్‌పోస్ట్‌ నిర్వహణను గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.

ఏడాది క్రితం కరోనా భయంతో మూతపడిన విద్యాసంస్థలు పూర్తిగా తెరచుకోవటంతో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు కళాశాలకు తరలివస్తున్నారు. అవుట్‌పోస్ట్‌ సేవలు ఆగిపోవటం పట్ల విద్యార్థులు, గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:మథురలో ఉత్సాహంగా 'లడ్డూమార్​ హోలీ'

ABOUT THE AUTHOR

...view details