తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో స్పష్టత...!

కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో​ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపు రెండు లక్షల వరకు పింఛన్​ దరఖాస్తులు పెండింగ్​లో ఉండగా... కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అటు వృద్ధాప్య పింఛన్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య ఇంకా పెరగనుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం విధానపర ప్రకటన చేయాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆసరా పింఛన్ల లబ్దిదారుల సంఖ్య మరో ఎనిమిది లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది.

By

Published : Feb 23, 2021, 8:00 PM IST

clarity on new asara pensions in coming budget sessions
clarity on new asara pensions in coming budget sessions

రాష్ట్రంలో ఆసరా పథకం సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లతో పాటు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు భృతి, బోధకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆర్థికసాయం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్ల సంఖ్య 37 లక్షలా 86 వేల 20. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 11 లక్షలా 76 వేల 743 కాగా... దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు నాలుగు లక్షల 81 వేల 210 మంది ఉన్నారు.

65 ఏళ్లు ఆ పైబడిన వారికి ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య పింఛన్​ అర్హతా వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 శాసనసభ ఎన్నికల సమయంలో తెరాస మేనిఫెస్టోలో పేర్కొంది. తెరాస సర్కార్ రెండో మారు అధికారంలోకి రాగానే ఫించను వయస్సు కుదింపునకు సంబంధించి కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేసింది. ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని అవసరమైన కసరత్తు చేసి 57ఏళ్ల వయస్సు, ఆ పైబడిన వారిని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా జిల్లాల్లో ఈ తరహాలో ఆరున్నర లక్షల మంది అదనపు లబ్ధిదారులు ఉన్నట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివరాలు కలిస్తే లబ్దిదారుల సంఖ్య ఇంకా పెరగనుంది.

65 ఏళ్ల వయస్సు పైబడిన వారికి సంబంధించిన పింఛన్​ దరఖాస్తులు కూడా పెండింగ్​లోనే ఉన్నాయి. వారికి కూడా ఫించన్లు మంజూరు కాలేదు. కొన్ని నెలల క్రితం కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే కొన్ని పింఛన్లు మంజూరయ్యాయి. కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని ఇటీవల నాగార్జునసాగర్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. 2020 - 21 బడ్జెట్​లో ఆసరా పథకానికి 11వేల 724 కోట్ల రూపాయలు కేటాయించి పింఛన్​ చెల్లింపులు చేశారు. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బడ్జెట్​లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 57 ఏళ్లకు కుదిస్తే లబ్దిదారుల గుర్తింపు చేపట్టాల్సి ఉంటుంది. కొత్త పింఛన్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ నేపథ్యంలో బడ్జెట్​లో ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్​ఎంసీ అధికారి

ABOUT THE AUTHOR

...view details