CJI NV Ramana visits Ponnavaram village: పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ అన్నారు. తన స్వగ్రామమైన పొన్నవరంలో జస్టిస్ ఎన్.వి రమణకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. సీజేఐకి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. గజమాలతో సత్కరించారు. వివిధ రకాల బహుమతులనూ గ్రామస్థులు అందించారు. అనంతరం సీజేఐకి వెండి నాగలి బహూకరించారు.
CJI NV Ramana visits his native village: ఈ సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్.వి రమణ.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పొన్నవరం గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందన్న సీజేఐ.. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని చెప్పారు. పొన్నవరం, కంచికచర్లలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని చెప్పారు. 1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం.. తమ పొన్నవరమన్న జస్టిస్ ఎన్.వి రమణ.. పొన్నవరం రోడ్లు, పొలాలు, చెరువులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని అన్నారు.
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. దీనికి తెలుగును జోడిస్తా. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చా. ఎంత ఎదిగినా నా మాతృభూమిని మరిచిపోలేదు. మనదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తోంది. సమస్యలు అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం పదిమందికీ తెలిసేలా మనం ప్రవర్తించాలి. భారత్ బయోటెక్ అధిపతి తెలుగువారైనందుకు గర్వపడాలి. తెలుగువాళ్లు కరోనా టీకా కనుక్కోవడం మనకు గర్వకారణం. తెలుగువారికి సరైన గుర్తింపు దక్కలేదని నాకు ఆవేదన ఉంది.'