తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టేలా ప్రభుత్వం చర్యలు - kaleshwaram

ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేలా రాష్ట్రంలోని అన్ని వాగులపై రెండేళ్లలో చెక్ డ్యాంలు నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. చెక్ డ్యాంల నిర్మాణంతో పాటు చెరువుల మరమ్మత్తుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 500టీఎంసీలకు పైగా నీటిని తీసుకుంటామన్న సీఎం... జలాశయాలు, చెరువులు నిండి తెలంగాణ వ్యాప్తంగా జలధారతో పుష్కలమైన పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామసాగర్ ఆయకట్టుకు ఎప్పుడూ నీటికొరత లేకుండా చూడాలని... అక్టోబర్ వరకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలను పూర్తి స్థాయిలో నింపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

check dams in telangana
ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టేలా ప్రభుత్వం చర్యలు

By

Published : Jan 4, 2020, 4:23 AM IST

Updated : Jan 4, 2020, 7:55 AM IST

ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టేలా ప్రభుత్వం చర్యలు

మిర్యాలగూడ డివిజన్​లోని సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లిచ్చేలా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎత్తిపోతల పథకం కోసం సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులతో ప్రగతిభవన్​లో సమావేశమైన సీఎం కేసీఆర్... నీటిపారుదల సంబంధిత అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతుందన్న ముఖ్యమంత్రి... కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామని చెప్పారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే 500టీఎంసీలకుపైగా నీరు తీసుకొని ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ మానేరు, ఎస్సారెస్పీతో పాటు కొత్తవైన మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, బస్వాపూర్ తదితర జలాశయాలు నింపుతామని వివరించారు. అన్నిచెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తామని తెలిపారు.

బడ్జెట్​లో నిధులు కేటాయిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో జలధార ఉంటుందని పుష్కలమైన పంటలుపండుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో నీళ్లు, వర్షంతో సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోకుండా ఎక్కడికక్కడ ఆపేలా చెక్‌డ్యాంల నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాగులపై ఉన్న చెక్ డ్యాంలు, అవసరాలకు సంబంధించిన లెక్కలు తీయాలని ఇంజినీర్లను ఆదేశించారు. అవసరమయ్యే చెక్​డ్యాంలలో ఈ ఏడాది సగం, వచ్చే ఏడాది మిగతా సగం నిర్మించాలని తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఈ నెల 15 వరకు టెండర్లు పిలవాలన్న కేసీఆర్... ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు.

గతంలోని నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి...

ఉద్యమ స్ఫూర్తితో మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించుకున్న చెరువులు... గ్రామానికి బతుకుదెరువుగా ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు. బాగుచేసుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలన్న సీఎం... ఇందుకు ఏటా బడ్జెట్​లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి వేసవిలో చెరువులో పూడికమట్టిని రైతులు... పొలాల్లోకి తీసుకువెళ్లేలా వ్యవసాయశాఖ, రైతుసమన్వయ సమితి, గ్రామపంచాయతీలు సమన్వయంతో పనిచేయాలని... కర్షకులను ప్రోత్సహించాలని సూచించారు. గతంలోని నీరటి కాడు వ్యవస్థ పునరుద్ధరించాలన్న కేసీఆర్... వీఆర్​ఏలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలని దిశానిర్దేశం చేశారు.

నీటి పారుదల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి...

రాష్ట్రంలో అన్ని జలాశయాలను అక్టోబర్ నాటికే పూర్తిస్థాయిలో నింపాలని ముఖ్యమంత్రి ఇంజినీర్లను ఆదేశించారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు... నీటికొరత లేకుండా చూడాలని... కడెం నుంచి వర్షాకాలం ఆరంభంలోనే పెద్దఎత్తున నీరు వచ్చే అవకాశం ఉన్నందున వేసవిలోనే ఎల్లంపల్లి జలాలను... శ్రీరామసాగర్‌కు తరలించాలని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని మరోసారి స్పష్టంచేశారు. ఇక నుంచి భారీ, మధ్యతరహా, చిన్ననీటిపారుదల అన్న తేడా లేకుండా ఒకే విభాగంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. నీటిపారుదలశాఖను ఐదారుగురు ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల పరిధిలోకి తేవాలని చెప్పారు.

ఇవీ చూడండి: పంచాయతీ కార్మికులకు తీపి కబురు

Last Updated : Jan 4, 2020, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details