"రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోలేకపోయిన వైద్యుడు సుధాకర్.. చివరికి చనిపోయే పరిస్థితి వచ్చింది" అని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజు నాడు ఎంపీ రఘురామను బలంవంతంగా అరెస్టు చేసి ఆయన కుటుంబానికి మానసిక వేదన మిగిల్చారని విమర్శించారు. పోలీసు కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజు కాళ్లు కట్టేసి బలవంతంగా కొట్టారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు మాట్లాడింది తప్పైతే.. తనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు కాదా? అని చంద్రబాబు నిలదీశారు. ఏ రాజకీయ పార్టీ ఏపీలో స్వేచ్ఛగా పనిచేయకుండా చేస్తున్నారన్నారు.
హైకోర్టు తీర్పులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశాలుగా మారుస్తామని చంద్రబాబు తెలిపారు. రఘురామకృష్ణరాజును పోలీసులు వేధించారని సుప్రీం కోర్టులో తేలిందన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులకు ఇది పరాకాష్టగా పేర్కొన్నారు. ప్రభుత్వ కస్టడీలో ఉన్నవారికి రక్షణ లేదని తేలిపోయిందని చెప్పారు. మాస్క్ అడిగిన పాపానికి వైద్యుడు సుధాకర్ మానసిక క్షోభకు గురై చనిపోయారని ఆవేదన చెందారు.
ఏపీ సీఎం ఆదేశాలే ముఖ్యమా?
'తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వ్యక్తికి ఎన్నికల కమిషనర్ గా ఉండే అర్హత ఉందా? సుప్రీం కోర్టు తీర్పు కాకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే ముఖ్యమా? నిబంధనలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి 160 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఆ మొత్తం ఎస్ఈసీ కడతుందా? లేక ముఖ్యమంత్రి కడతారా? మాపై దాడులకు దిగి తప్పుడు కేసులు పెడుతున్నారు. పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలంతా చదవాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుకు అయినా విలువ లేకుండా చేసి, హైకోర్టు తీర్పును సజ్జల వ్యతిరేకించటం దుర్మార్గం. 151మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రన ఇష్టానుసారంగా రౌడీయిజం చేసే హక్కులేదు' - చంద్రబాబు, తెదేపా అధినేత.
'రిజర్వేషన్లు లేకుండా చేస్తారు'
"రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసేందుకు ప్రజలు అధికారం కట్టబెట్టలేదని తెలుసుకోవాలి" అని చంద్రబాబు హితవు పలికారు. పాలన ఇలాగే కొనసాగిస్తే అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు కూడా లేకుండా చేస్తారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టు తీర్పు స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కానీ.. ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు.