2016 మేనిఫెస్టోలోని అంశాలను తెరాస ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గత మేనిఫెస్టో అంశాలనే ఈసారి ఎన్నికల్లోనూ పొందుపరిచారన్నారు. హైదరాబాద్ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వరదల్లో 40 మందికి పైగా చనిపోయిన విషయాన్ని కిషన్రెడ్డి గుర్తు చేశారు.
సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. ఆరున్నరేళ్లలో వరద నీటి నిర్వహణ పనులు సరిగా చేపట్టలేదు. పాత నగర ప్రజల ఓట్లు అడిగే హక్కు తెరాస, మజ్లిస్కు ఉందా?. ఎంఎంటీఎస్ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అన్నారు. ఎంఎంటీఎస్ పనులు రైల్వే చేపడుతుంది.. కొంత వాటా రాష్ట్రం ఇస్తుంది. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు 98 శాతం పూర్తయ్యాయి. రాష్ట్రం వాటా ఇవ్వనందున ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో జాప్యం జరిగింది. - కిషన్రెడ్డి, హోం శాఖ సహాయ మంత్రి.