తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2022, 6:47 AM IST

ETV Bharat / city

ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు కుట్ర: సీబీఐ

YS Viveka murder case: ఏపీ మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నుంచే పథకరచన జరిగిందని వివరించింది. హత్యలో కీలకపాత్ర ఎర్ర గంగిరెడ్డిదేనని వెల్లడించింది. ఎర్ర గంగిరెడ్డి.. మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు, ఇతర కుట్రదారులతో కలిసి సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

YS Viveka murder case
YS Viveka

YS Viveka murder case: ఏపీ మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులైన షేక్‌ దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌లను ఇంటికి పిలిపించి వివేకా హత్యకు పథకరచన చేశారని వివరించింది. వివేకాను అంతం చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారంటూ నిందితులు ముగ్గురికీ ఎర్ర గంగిరెడ్డి చెప్పారని పేర్కొంది. హత్యలో కీలకపాత్ర అతనిదేనని వెల్లడించింది. ఈ కేసులో గతంలో అరెస్టయ్యి, ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ జనవరిలో ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర, ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలు, అతను సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న తీరు, బెయిలు రద్దు చేయాల్సిన అవసరం తదితర అంశాల్ని ఆ పిటిషన్‌లో వివరించారు. ప్రధానాంశాలివీ..

నిందితుల్ని లోపలికి తీసుకెళ్లింది గంగిరెడ్డి..

  • 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకాను హత్య చేసేందుకు సునీల్‌యాదవ్‌, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డిలను వివేకా ఇంట్లోకి తీసుకెళ్లింది గంగిరెడ్డే. హత్య తర్వాత మిగతా నిందితులతో కలిసి వివేకా ఇంటివద్ద నుంచి పారిపోతుండగా వాచ్‌మన్‌ రంగన్న చూశారు. ఎవరితోనైనా చెబితే చంపేస్తానని అతన్ని బెదిరించారు. పలువురు సాక్షుల్ని బెదిరించారు. రాజకీయ పార్టీలతో గంగిరెడ్డికి సత్సంబంధాలున్నాయి.
  • 2019 మార్చి 15వ తేదీ ఉదయాన్నే వివేకా ఇంటి వద్దకు చేరుకుని.. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో కలిసి వివేకా గుండెపోటుతో మరణించారనే ప్రచారం ప్రారంభించారు.
  • వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ సాక్షి టీవీకి తొలుత సమాచారమిచ్చారు. ఇంటివద్ద ఉన్న జనాల్ని నియంత్రించేందుకు రావాలని సీఐ శంకరయ్యకు చెప్పారు.
  • ఘటనాస్థలంలో ఆధారాలు ధ్వంసం చేయటంలోనూ, బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయించటంలోనూ గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డిలదే కీలకపాత్ర.
  • లోపల నుంచి గడియ పెట్టేసి వివేకా మృతదేహానికి కట్లు కట్టించారు. దీనిపై ప్రశ్నించినందుకు సీఐ శంకరయ్యను నోర్మూసుకుని ఉండాలంటూ హెచ్చరించారు.
  • శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో భారీ కుట్ర, ఆధారాల ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోంది.
  • గంగిరెడ్డి బయటే ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు...

ఎర్ర గంగిరెడ్డి.. మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు, ఇతర కుట్రదారులతో కలిసి సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో సాక్షులైన కల్లూరు గంగాధర్‌రెడ్డి, అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి (ఫిర్యాదుదారు)లు.. వారి ప్రభావానికి లోనయ్యారన్న అనుమానం ఉంది.

  • వివేకా హత్యానేరాన్ని తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని తొలుత వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి ఆ తర్వాత మాట మార్చారు. సీబీఐపైన అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
  • వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె.శంకరయ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పట్లోనే ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయనకూడా మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి తొలుత అంగీకరించి, అనంతరం నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తేసింది.
  • వివేకా పీఏగా వ్యవహరించిన ఎంవీ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తొలుత ఆ ఘటనపై పులివెందుల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ తనను ఒత్తిడి చేసి, తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు చెప్పబట్టే ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు అనుమానం ఉంది.

ఇదీచూడండి:'జపోరిజియా ప్లాంట్​పై దాడికి జెలెన్‌స్కీనే కారణం'

ABOUT THE AUTHOR

...view details