Amaravati Farmers : అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేయటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో వందల మంది పోలీసులను మోహరించి భీతావహ వాతావరణం సృష్టించింది. కాలు కదిపితే కేసు.. అడుగు బయటపెడితే అరెస్టు అన్నట్లు వ్యవహరించింది. గత 27 నెలల్లో (రెండేళ్ల మూడు నెలల్లో) ప్రభుత్వం తమపైన 3,852 కేసులు పెట్టిందని రాజధాని రైతులు చెబుతున్నారు. మహిళలు, ఎస్సీలు, వృద్ధులు, ఇతర రైతులు ఇలా వేల మందిని ఈ కేసుల్లో నిందితులుగా చేర్చింది. అరెస్టులు చేసి బెదిరించింది. అనేక సందర్భాల్లో దాష్టీకానికి దిగింది. వాటన్నింటికీ ఎదురొడ్డి మరీ ఉద్యమించిన రైతులు..విజయం సాధించారు.
Amaravati Farmers : రైతులపై అడుగడుగునా పోలీసు జులుం.. 27 నెలల్లో 3,852 కేసులు - Amaravati Farmers movement
Amaravati Farmers : వాళ్లేమీ ఉగ్రవాదులు కాదు.. తిరుగుబాటుదారులు అసలే కాదు.. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న కన్నతల్లి లాంటి భూములను రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు.. ఆ భూమిపైనే ఆధారపడి బతికిన రైతు కూలీలు.. మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యమించారు.. పట్టువిడవకుండా ఏకధాటిగా 807 రోజులపాటు తీవ్ర నిర్బంధాలు, ఆంక్షల నడుమ పోరాటాన్ని కొనసాగించారు. ఆగ్రహించిన ప్రభుత్వం తమపై 27 నెలల్లో 3,852 కేసులు పెట్టారంటూ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Amaravati Farmers
ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
- Amaravati Farmers Protest : అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందని బయటి వ్యక్తులు మూడు రాజధానులకు మద్దతుగా ధర్నా సేందుకు వస్తుంటే వారిని ప్రశ్నించినందుకు ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు పెట్టి, అరెస్టు చేశారు. కరడుగట్టిన నేరగాళ్ల మాదిరి వారికి సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు.
- అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటూ వందలమంది రైతులపై కేసులు నమోదు చేశారు.
- ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట శాంతియుత ర్యాలీ చేపట్టిన అమరావతి మహిళల్ని పోలీసులు ఈడ్చిపడేశారు. అనుమతి లేకపోయినా నిరసన తెలిపారంటూ 377 మంది రైతులు, మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొంతమందిని అరెస్టు చేశారు. ఆందోళన కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఓ మహిళా కానిస్టేబుల్తో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు.
- చెన్నై-కోల్కతా జాతీయ రహదారిని దిగ్బంధించారంటూ వందల మంది రైతులపై కేసులు పెట్టారు. జాతీయ రహదారి ముట్టడిలో భాగంగా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి చేశారంటూ వంద మందిపై కేసులు నమోదు చేశారు.
- అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న డిమాండుతో 2020 జనవరి 10న మహిళలపై విజయవాడలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్నారంటూ 487 మంది మహిళలపై కేసులు పెట్టారు.
- రాజధానిలో వైకాపా ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారంటూ 100 మందిపై కేసులు పెట్టి, 15 మందిని అరెస్టు చేశారు.
- బాపట్ల ఎంపీ నందిగం సురేష్ను అడ్డగించారన్న ఆరోపణలతో పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మందడంలో డ్రోన్ కెమెరాలు ధ్వంసం చేశారని, రాస్తారోకో నిర్వహించారని 100 మందిపై కేసులు నమోదు చేశారు.
- ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరిట అమరావతి నుంచి తిరుమల వరకూ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న రైతులపై లాఠీఛార్జీలు చేశారు. అడ్డంకులు సృష్టించారు. వారిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు
ప్రధానంగా ఈ అభియోగాలతోనే కేసులు
- Cases on Amaravati Farmers : సీఆర్పీసీ సెక్షన్ 144, భారత పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా వాటిని ఉల్లంఘిస్తూ ర్యాలీలు, పాదయాత్రల్లో పాల్గొన్నారంటూ వేల మందిపై కేసులు పెట్టారు.
- పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని, వారిపై దాడి చేశారని, వారిని కించపరిచేలా నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని
- ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం కలిగించారని, అసెంబ్లీ ముట్టడికి యత్నించారని
- ముందస్తుగా నిర్బంధించకపోతే నేరానికి పాల్పడే అవకాశం ఉందని
- అనుమతులు లేని సభలు, ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారని
- చట్టవిరుద్ధంగా ఒకచోట గుమిగూడారని, ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాల్ని ఉల్లంఘించారని, ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరిచారని, నేరపూరిత బెదిరింపు, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసులు పెట్టారని వాపోతున్నారు.