తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 12:13 AM IST

ETV Bharat / city

రోగ నిరోధక శక్తే కరోనాకు విరుగుడు : ఏపీ సీఎం జగన్

కరోనా వైరస్ జీవితంలో అంతర్భాగం అవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైరస్‌ సోకినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నయం అయిపోతుందని చెప్పారు. కరోనా తనతో పాటు ఎవరికైనా సోకవచ్చని సీఎం అన్నారు.

రోగ నిరోధక శక్తే కరోనాకు విరుగుడు : ఏపీ సీఎం జగన్
రోగ నిరోధక శక్తే కరోనాకు విరుగుడు : ఏపీ సీఎం జగన్

దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెల రోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ వివరించారు.

వారికి హ్యాట్సాఫ్

'కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. టెలీ మెడిసిన్​ సేవలను అందుబాటులోకి తెచ్చామన్న ఆయన.. అవసరమైన మందులను డోర్‌ డెలివరీ చేసేందుకు నెల రోజుల్లోనే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టామని తెలిపారు. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా' అని సీఎం చెప్పారు.

రోగ నిరోధక శక్తే పరిష్కారం

'కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవంగా ఆలోచించాల్సిన అంశం. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుంది. కరోనా సోకితే అంటరానితనమనో.. ఒక భయంకరమైన రోగమనో అనే భావన తొలగిపోవాలి. రాబోయే రోజుల్లో సహజంగా అందరికీ వచ్చే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ తీసేయలేం. మన జీవితంలో ఇది అంతర్భాగం అవుతుంది. స్వైన్‌ఫ్లూ, చికెన్‌ఫాక్స్‌ తరహాలోనిదే ఇది కూడా. అయితే అవన్నీ నయమయ్యే వ్యాధులు. కరోనా సోకిన విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్లు 80 శాతం మంది ఉన్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండానే వచ్చే అవకాశముంటుంది. ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 81 శాతం కేసులు ఇళ్లల్లో ఉండి నయమైనవి ఉన్నాయి. కరోనా సోకిందని చెప్పుకుంటే అంటరానివాడనే భావన తీసేయాలి. కరోనా జ్వరం లాంటిదే. భవిష్యత్తులో నాకు కూడా రావచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. పెద్దవాళ్లకు కాస్త దూరంగా ఉంటే చాలు. ఇది ఎవరికైనా రావొచ్చు. వివక్ష చూపాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంచెం కరోనా లక్షణాలు కనిపించినా తమంతట తామే వైద్యులకు సమాచారమిస్తే మందులిచ్చి వెళ్తారు. దీన్ని ఆ విధంగా భావించాలని అందరినీ వినయపూర్వకంగా కోరుతున్నా. మనంతట మనమే కట్టడి చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే వైరస్​ సమస్యకు పరిష్కారం' అని జగన్‌ అన్నారు.

రోగ నిరోధక శక్తే కరోనాకు విరుగుడు : ఏపీ సీఎం జగన్

ఇవీ చూడండి : లాక్​డౌన్ సమయంలో ఇల్లు గుల్ల చేసిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details