CAG Unsatisfied On AP Budget Allocations : ఏపీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రుణాల నిమిత్తం చెల్లించిన మొత్తంలో 60 వేల 740 కోట్ల 83 లక్షల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల చెల్లింపుతో పాటు..గతేడాది తీసుకున్న 362 కోట్లు కలసి ఉందని కాగ్ తేల్చింది. ఈ వ్యయానికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపుల్లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి..15 వేల 991 కోట్ల 85 లక్షల అనుబంధ పద్దుల్ని 2020 జూన్లో శాసనసభ ఆమోదానికి ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టింది. ఆ మొత్తాన్ని చట్టసభల ఆమోదం పొందకుండానే 2020 మార్చి 31లోగా ప్రభుత్వం ఖర్చు చేసేసిందని తెలిపింది. అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కాగ్ వెల్లడించింది. ఈ ప్రక్రియ చట్టసభల ఆమోద ప్రక్రియ, బడ్జెట్పై నియంత్రణను బలహీనపరుస్తుందని వివరించింది. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించినట్టవుతుందని కాగ్ కుండబద్ధలు కొట్టింది.
cag on spending billions without budget allocations : ఈ మొత్తం అంశానికి ప్రభుత్వం కొవిడ్ను కారణంగా చూపిందని కాగ్ వెల్లడించింది. 2020 మార్చి చివరిలో లాక్డౌన్ విధించిన మాట వాస్తవమే అయినా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం పొందిందని గుర్తుచేసింది. 2019-20 సంవత్సర అనుబంధ పద్దుల వివరాల్ని దానిలో చేర్చలేదని తెలిపింది. వాస్తవికత లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు..పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాల అమల్లో సామర్థ్య లోపం, బలహీనమైన అంతర్గత నియంత్రణల కారణంగా వివిధ అభివృద్ధి కారక అంశాలకు అవసరమైనదానికంటే తక్కువ కేటాయింపులు చేస్తున్నారని ఎత్తిచూపింది. అదే సమయంలో కొన్ని శాఖల్లో ఎక్కువ నిధులు మిగిలి పోతున్నాయని వెల్లడించింది. శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేస్తున్న సందర్భాలు పునరావృతమవుతున్నాయని కాగ్ నివేదికలో వివరించింది.