తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2021, 9:34 AM IST

ETV Bharat / city

బ్రహ్మంగారిమఠంలో కొలిక్కి వచ్చిన పీఠాధిపత్య వివాదం

ఆంధ్రప్రదేశ్​లోని పోతులూరి వీరబ్రహ్మేందస్వామి మఠం(bramhamgari matam) పీఠాధిపత్యంపై వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నెల రోజులపాటు కుటుంబ సభ్యుల మధ్య నలిగిన వివాదానికి అధికారులు పరిష్కారం చూపారు. దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠాధిపత్యం కట్టబెట్టేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. త్వరలోనే 12వ పీఠాధిపతిగా ఆయన ప్రమాణం చేయనున్నారు.

brahmamgari matham
బ్రహ్మంగారిమఠం

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోనే పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి నియామకం ఖరారైంది. నెలరోజులుగా వారసత్వ వ్యవహారంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదాన్ని ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించింది. ప్రత్యేక అధికారి, స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి.. వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు.

గత నెల 8న మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం పొందగా.. అప్పటి నుంచి తదుపరి పీఠాధిపతి ఎవరన్న దానిపై వారసుల మధ్య వివాదం నడుస్తోంది. వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారులు, రెండోభార్య కుమారులు పీఠాధిపత్యం కోసం పట్టుబట్టారు. తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు.

ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారం తేల్చేందుకు దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించింది. ఆయన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. పీఠాధిపతిగా మొదటి భార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, ఉత్తరాధి పీఠాధిపతిగా రెండో కుమారుడు భద్రయ్యస్వామిని నియమించేలా కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. వీరి తదనంతరం.. రెండో భార్య కుమారుడు గోవిందస్వామికి పీఠాధిపతి అవకాశం దక్కనుంది. ఈ మేరకు రాతపూర్వక హామీ ఇచ్చారు.

నెలరోజుల పాటు బ్రహ్మంగారి మఠంలో నెలకొన్న వివాదానికి తెరపడటంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. మఠం పవిత్రతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details