కళ్లు లేకపోవడం అంటే ఏమిటీ? వెలుగుని చూడలేకపోవడమా... చీకటంటే తెలియకపోవడమా! రెండూనూ. కానీ నా వరకూ నేను రెండోదాన్నే తీసుకుంటాను. ప్రపంచమంతా చూస్తున్న వెలుగుల్ని నేను చూడలేకపోతున్నానని బాధపడటం కన్నా... అసలు చీకటంటే ఏమిటో తెలియని విధంగా దేవుడు నన్ను సృష్టించాడని సంతోషిస్తాను. అదే పాజిటివ్ దృక్పథం అని నేను నమ్ముతాను. కానీ ఇది ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చూసి నేర్చుకున్నది కాదు... అక్షరాలేవీ తెలియని నా కుటుంబసభ్యులు నాకు నేర్పింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని గూడపల్లి గ్రామంలో గంటాలమ్మ గుడి దగ్గరుండే పూరి గుడిసెల్లో మా ఇల్లూ ఒకటి. మా నాన్న వాలి... వ్యవసాయ కూలీగా చేస్తుండేవాడు. కూలీ లేనప్పుడు చుట్టుపక్కలున్న రేషన్ షాపులకెళ్లి వాళ్ల దగ్గరున్న గోనెసంచులు తీసుకుని... వాటిని పాలకొల్లులోని కొబ్బరి వ్యాపారులకి అమ్ముతుండేవాడు. అలా వచ్చిన నాలుగురాళ్లతోనే ఆరుగురి ఆకలి తీర్చాల్సి వచ్చేది. ఆరుగురు అంటే నేను పుట్టడానికి ముందు సంగతి... అప్పట్లో అమ్మానాన్నలతోపాటూ మా ముగ్గురన్నలూ, అక్కా ఉండేవారు. అమ్మకి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల నేను కడుపులో పడ్డాక అనారోగ్యానికి గురైందట. అప్పుడు వాడిన మందులతో గర్భంలో నా ఎదుగుదల దెబ్బతింది... సరిగ్గా చెప్పాలంటే కంటినీ, మెదడునీ అనుసంధానించే నరాలవ్యవస్థ వృద్ధికాలేదు. దాంతో నేను అంధుడిగానే పుట్టాను. కానీ ఆ విషయాన్ని నాకు నాలుగేళ్లు వచ్చేదాకా ఎవరూ గుర్తించలేకపోయారు. గుర్తించాక జిల్లాలోని ఎన్నో ఆసుపత్రులకి తిప్పారు కానీ... అప్పటికే వైద్యులు ఆలస్యమై పోయిందని చెప్పారట. అది తెలిసిన రోజు అమ్మావాళ్లు ఎంత కన్నీరుమున్నీరయ్యారో నాకు గుర్తులేదుకానీ... అప్పటి నుంచీ నా కంట మాత్రం చుక్కనీరు కూడా రానివ్వలేదు!
పట్టుబట్టి మరీ...
అమ్మానాన్నా, అక్కా, అన్నయ్యల ఆదరణలో ‘అయ్యో కళ్లులేవే’ అన్న బాధ నాకెప్పుడూ రాలేదు. పైగా అందరికన్నా చిన్నవాణ్ణి కాబట్టి గారాబంగానే చూసేవారు. అమ్మానాన్నలకి చదువురాకున్నా ఎంతోమందిని ప్రాధేయపడి నర్సాపురంలోని అంధుల బడిలో చేర్చారు. అదో రెసిడెన్షియల్ స్కూల్. నన్నక్కడ వదిలిపెట్టి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అక్కా, అన్నయ్యలూ, అమ్మానాన్నలూ ఎంతగా ఏడ్చారో నాకిప్పటికీ గుర్తుంది. ఆ ఒక్కసారే కాదు... ప్రతిసారీ నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడల్లా ఇంట్లోవాళ్లెవరికీ కన్నీళ్లు ఆగేవి కావు. దాన్ని చూసి మా బంధువులంతా ‘ఆడపిల్ల అప్పగింతల్లా ఆ ఏడుపేమిటీ?!’ అనేవాళ్లు. పోనుపోను ఆ ఎగతాళి కాస్తా ‘వీడు చదివి కలెక్టర్గిరీ చేస్తాడా ఏం? మీరు కలోగంజో తాగి కష్టపడుతూ వాణ్ణి చదివించడమెందుకు... వృధా!’ అనేలా మారిందట. అమ్మానాన్నా వాళ్లమాటలు వినలేదు సరికదా... అలా అన్నవాళ్లందరినీ దూరం పెట్టేశారు! వాళ్లలోని ఆ పట్టుదలకి తగ్గట్టే నేను బాగా చదవాలనుకున్నాను. సాధారణంగానే అంధుల్లో వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరో వస్తువుని రంగులూ, పరిమాణాలతో గుర్తించినట్టే... మేం శబ్దంలోని స్థాయీభేదాలని బట్టి దాన్ని మనసులో ముద్రించుకుంటాం. వినడంలో నాకున్న ఆ తీక్షణతనే నేను ఆయుధంగా మలచుకున్నాను. దానికి బ్రెయిలీని ఆసరాగా చేసుకున్నాను. క్లాసులో ఫస్ట్ ర్యాంకు సాధించడం మొదలుపెట్టాను. ఏడో తరగతికల్లా రాష్ట్ర ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. ఎనిమిదో తరగతి నుంచీ డాక్టర్ని కావాలని కలలుకన్నాను. అప్పట్లో ఇంగ్లిషు వస్తేనే డాక్టర్ కావడం సాధ్యమనుకునేవాణ్ణి. కానీ నాకోసం ప్రత్యేకంగా ఇంగ్లిషు ఎవరు నేర్పుతారు! అందుకని నేనే సొంతంగా తయారవడం మొదలుపెట్టాను. నేను చదివిన అంధుల మిషనరీ బడిలో తెలుగు-ఇంగ్లిషు-హిందీ మూడు భాషలకీ చెందిన బ్రెయిలీ బైబిల్ ఉండేది. అందులోని ఒక్కో వాక్యాన్నీ ఇంగ్లిషులో చదవడం... దానికి సమానమైన దాన్ని తెలుగులో చూడటం... అప్పటికీ అర్థంకాకపోతే ప్రతిపదాన్నీ డిక్షనరీలో వెతకడం... ఇలా చేసేవాణ్ణి. ఏడాదితిరక్కుండానే ఇంగ్లిషు మాట్లాడటం, రాయడంలో తోటి విద్యార్థులకన్నా ముందు నిలిచాను. అప్పటికే అంధులు వైద్యులు కాలేరనే చేదునిజం తెలిసినా నేను ఏదో ఒక సబ్జెక్టు కోసం శ్రమించడం మాత్రం మానుకోలేదు. పదో తరగతిలో నాకు మంచి మార్కుల్ని అందించిందీ అలవాటు.
అమ్మ నిబ్బరమే...
ఇంటర్మీడియట్కు మా మండలకేంద్రం మలికిపురంలోని ఏవీఎన్జేఎస్ అండ్ ఆర్వీఆర్ కాలేజీలో చేరాను. అక్కడా మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు... ఇంటర్-కాలేజీ వక్తృత్వపోటీలూ, వ్యాసరచనల్లో మా కాలేజీకి ఎన్నో బహుమతులు సాధించిపెట్టాను. దాంతో ప్రతి ఒక్కరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు. ఆ అభిమానం ఎంతగా ఉండేదంటే... ఇంటర్మీడియట్ పూర్తయి నేను అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు లెక్చరర్లూ, విద్యార్థులూ అందరూ కలిసి నాకు ఒక ఉంగరం బహుకరించారు. ఆ ఉంగరం ఇప్పటికీ నా దగ్గరే ఉంది.
‘ఇప్పటికీ ఉంది’ అని ఎందుకు చెబుతున్నానంటే... అలాంటి విలువైన వస్తువులెన్నో అమ్మి మరీ చదువుకోవాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఏర్పడింది కాబట్టి! ఆ రోజు నేను కాలేజీ నుంచి వచ్చినప్పుడు పలకరించిన నాన్న గొంతు ఎందుకో నీరసంగా అనిపించింది. గోనెసంచుల మోతబరువు ఎక్కువై అలా ఉన్నాడనుకుని ఇంట్లోకి వెళ్లాను కానీ... అంతలోనే ఛాతీ నొప్పని కుప్పకూలిపోయాడు. అన్నయ్యలు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూశాడు. కళ్లులేని నాకు జీవితంలో తొలిసారి దిక్కుతోచకుండా పోయింది ఆ రోజే. అమ్మ నా కోసమే లేని నిబ్బరాన్ని తెచ్చుకుంది. ఇంట్లో ఎన్నికష్టాలున్నా నేను చదవాల్సిందేనని పట్టుబట్టింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమకి ఉన్నాలేకున్నా నాకు ఫీజులు కట్టడానికి సిద్ధమయ్యారు. మా ఇబ్బందులు చూసి మలికిపురంలోని రోటరీ క్లబ్ నాకో కంప్యూటర్ అందించింది. అది నేనుఎన్నో అంశాలపైన లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది.