Parliament Prawas Yojana: తెలంగాణలో పాగా వేయడమే అజెండాగా... కమలదళం వ్యూహాలను ఉద్ధృతం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కమిటీలను కూడా వేసింది. పార్లమెంట్ స్థానాలపైనా కాషాయదళం ప్రత్యేక గురిపెట్టింది. కేంద్రంలోని నరేంద్రమోదీ పథకాల విజయాల్ని ప్రచారం చేయడంతో పాటు... అమలుతీరు తెలుసుకునేందుకు కేంద్రమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.
ఇందుకోసం 17 పార్లమెంట్ స్థానాలుండగా... సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా తొలిదశలో 14స్థానాలను ఎంపిక చేసింది. వీటిని నాలుగు క్లస్టర్లుగా విభజించి... ఒక్కో దానికి ఒక్కో కేంద్రమంత్రిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఆ క్లస్టర్ పరిధిలో ఇన్ఛార్జీ మంత్రితో పాటు ఒకరిద్దరు కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికలకు వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విడతలవారీగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో చర్చించారు. క్లస్టర్లతో పాటు ఒకటి లేదా రెండు పార్లమెంట్ స్థానాలకు ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర మంత్రులు తక్కువ ఓట్లు వచ్చిన బూత్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తెలిపారు.