తెలంగాణ

telangana

ETV Bharat / city

'వారిది బురద రాజకీయం..నేను అలా ప్రవర్తించలేను'

వైకాపా నేతల వ్యాఖ్యలపై భాజపా నేత సుజనా చౌదరి మండిపడ్డారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, రమేశ్‌ కుమార్‌ వేర్వేరు అంశాల పై విడివిడిగా కలిశారని.. దానిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు.

By

Published : Jun 24, 2020, 1:03 PM IST

'వారిది బురద రాజకీయం..నేను అలా ప్రవర్తించలేను'
'వారిది బురద రాజకీయం..నేను అలా ప్రవర్తించలేను'

‘మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఏపీ ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌లతో నా సమావేశాల్ని రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు వారి నేలబారు మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నట్టే. నలుగురు కలసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. కామినేని, రమేశ్‌ కుమార్‌ వేర్వేరు అంశాలపై విడివిడిగా నన్ను కలిశారు. అవి సాధారణ సమావేశాలే. కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎవరినో ఏదో చేయడానికి కాదు’ అని భాజపా నాయకుడు, వై.సుజనా చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘లాక్‌డౌన్‌ తర్వాత నా అధికార, వ్యాపార కార్యకలాపాల్ని పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచే నిర్వహిస్తున్నా. ఈ నెల 13న కామినేని నన్ను కలవడానికి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అదే రోజు రమేశ్‌ కుమార్‌ నన్ను కలుస్తానని అడిగారు. కామినేనితో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడా. ఆయన వెళ్లాక రమేశ్‌ కుమార్‌ కలిశారు. ఆయన మా కుటుంబానికి చిరకాల మిత్రులు. ఆయనతో ఇటీవలి పరిణామాల గురించిగానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన అంశాల్నిగానీ చర్చించలేదు’ అని సుజనా పేర్కొన్నారు.

ఇదే అంశంపై కామినేని ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. పార్క్‌ హయత్‌ హోటల్‌ రహస్య ప్రదేశమేమీ కాదని, తాను అందరి ముందే వెళ్లి సుజనా చౌదరితో మాట్లాడి వచ్చానని, దాన్ని దొంగల సమావేశం అని ఎలా అంటారని ఆయన మండిపడ్డారు.

నేను నా పని చూసుకుని వచ్చేశా: కామినేని

‘సుజనాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగితే 11.30కి రమ్మన్నారు. నేను వెళ్లి కలిశా. నేను అక్కడున్న సమయంలో రమేశ్‌ కుమార్‌ వచ్చారు. నేను నా పని చూసుకుని వచ్చేశా. ఆ తర్వాత వారిద్దరూ భేటీ అయ్యారు. వ్యక్తుల గురించి న్యూనతగా మాట్లాడవద్దని కోరుతున్నా’ అని కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

రమేశ్‌ కుమార్‌ను అరెస్టు చేయాలి: అంబటి రాంబాబు

రాజకీయ కుట్ర చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి, ఆయన భాజపా నేతలతో జరిపిన మంతనాలపై విచారణ జరిపించాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో రమేశ్‌ కుమార్‌, భాజపా నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రహస్య భేటీకి ప్రతిపక్ష నేత చంద్రబాబే మార్గదర్శకుడు. గంటన్నరపాటు జరిగిన ఆ భేటీలో ఏం చర్చించారో తేలాలి. దీనిపై రమేశ్‌, చంద్రబాబు నోరు విప్పాలి’ అని డిమాండు చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇవీ చదవండి:తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే నేరమా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details