హైదరాబాద్ కూకట్పల్లిలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెట్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివేకానందనగర్, మౌలాలి, జాంబాగ్ డివిజన్లలో భాజపా ఏజెట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉన్నాయని వివేకానందనగర్ భాజపా ఏజెంట్ ఆరోపించారు. బ్యాలెట్ బాక్సు సీలు సక్రమంగా లేదని ఏకాంత్గౌడ్ బయటకు వెళ్లిపోయారు. బూత్ నంబరు 76లో పోలైన ఓట్ల కంటే 200పైగా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు.
ఆ 3 చోట్ల ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ల అభ్యంతరాలు... - జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపుపై పలు కేంద్రాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కూకట్పల్లిలోని పలు డివిజన్లలో ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్లు అభ్యంతరాలు తెలిపారు. మౌలాలి, జాంబాగ్లోనూ ఇదే తీరులో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
మౌలాలి డివిజన్లోని ఓ బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటం వల్ల కౌంటింగ్ నిలిపివేశారు. ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జాంబాగ్ డివిజన్లో సైతం ఓట్ల లెక్కింపుపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. జాంబాగ్ డివిజన్లోని బూత్ నంబరు 8లో 471 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు ఉండటంపై భాజపా ఏజెంటు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా ఓట్ల గల్లంతుపై ఆరా తీయగా... పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని అధికారులు వెల్లడించారు.