Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై న్యాయబద్దంగా పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే.. కరుణానిధి, జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ అందరికీ గుర్తుకొస్తారని తెలిపారు. కేసీఆర్ను తప్పకుండా.. జైలులో వేస్తామని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పునరుద్ఘాటించారు.
చీకోటి ప్రవీణ్ వెనక సగం మంది తెరాస నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. భాజపా నేతలను తిట్టే తెరాస నేతలు వారం రోజులుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా.. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగడతానన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై స్పందిస్తూ.. నేనెక్కడ పోటీ చేయాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ తన అభిప్రాయం చెప్పారని వివరించారు. ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేసేది అధిష్ఠానం చెప్తుందని పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందని సంజయ్ తెలిపారు.