Azadi ka amrit mahotsav at Vignan college : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని.. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా 500 అడుగుల జాతీయ జెండాతో వేయి మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విజ్ఞాన్ సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య, కేంద్రమంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్ని వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు
దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు నిజమైన స్వాతంత్య్ర ఫలాల్ని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తోందని కేంద్రమంత్రులు ఫగ్గణ్సింగ్ కులస్తే, రాందాస్ అఠావలే అన్నారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, ఉపాధి కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అమృతోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు.
పిల్లల నుంచి పెద్దలదాకా సాంకేతికత
ఆజాదీకా అమృత్ మహోత్సవాల ముందు, ఆ తర్వాత దేశంలో గమనిస్తే.. మన గ్రామంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో అభివృద్ధి చూస్తున్నారు. తాగు నీరు కొరత తీర్చాం. రోడ్ల విస్తరణ, ఐటీ రంగంలోనూ క్రమంగా అభివృద్ధి సాధించాము. పిల్లల నుంచి పెద్దల వరకు సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత ఎంత పెరిగిందో చూశాం. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ కావాలనుకుంటున్నారు. ఏ వస్తువైనా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాలనుకోవట్లేదు. ప్రతి ఉత్పత్తీ భారతదేశంలోనే తయారుకావాలనుకోవడం మోదీ లక్ష్యం. సబ్ కా సాత్, సబ్కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో ప్రధాని ముందుకు వెళ్తున్నారు. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తున్నారు. వ్యక్తిత్వమే మా మతమని విజ్ఞాన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. వ్యక్తిత్వంతోనే ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు.