తెలంగాణ

telangana

ETV Bharat / city

అందుకే ఈ టీచరమ్మ అద్భుతం ! - మహిళా మంత్రి

గతేడాది చివరిలో వూహాన్‌ వేదికగా ఊపిరి పోసుకుంది కరోనా వైరస్‌. క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇండియాలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని చాలామంది అనుకున్నారు. అయితే కేరళకు చెందిన ఓ ప్రజాప్రతినిధురాలు మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించారు. కేరళలో మొదటి పాజిటివ్ కేసు నమోదు కాగానే మరింత అప్రమత్తమై కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించారు. ‘టెస్టింగ్‌... ట్రేసింగ్‌... ఐసోలేట్‌’ పాలసీని పక్కాగా అమలు చేసి వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు అరికట్టారు. ఆమే కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. తన పక్కా ప్రణాళికలతో ప్రాణాంతక వైరస్‌ను నిరోధించి ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న ఆమె తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ప్రాస్పెక్ట్‌’ అనే పత్రిక ‘టాప్‌ 50 థింకర్స్‌ 2020’ పేరుతో విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచారీ సూపర్‌ ఉమన్.

అందుకే ఈ టీచరమ్మ అద్భుతం !
అందుకే ఈ టీచరమ్మ అద్భుతం !

By

Published : Sep 5, 2020, 2:59 AM IST

పక్కా ప్రణాళికతో పరీక్షలు !

ఇండియాకు సంబంధించి భూతల స్వర్గమైన కేరళలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. జనవరి 30న వూహాన్‌ నుంచి వచ్చిన ఓ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేరళతో పాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అంతకుముందే వైరస్‌ వ్యాప్తిపై సమీక్ష జరుపుతున్న శైలజ మరింత అప్రమత్తమయ్యారు. అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ‘టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేట్’ సూత్రాన్ని పక్కాగా అమలు చేశారు. విమానాశ్రయాల్లో పకడ్బందీగా కరోనా పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్వారంటైన్‌ నిబంధనలను కట్టుదిట్టం చేశారు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. సోషల్‌ డిస్టెన్స్, మాస్కుల వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.

ఆమె కృషి ప్రశంసనీయమంటూ !

కరోనాను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ ప్రజాప్రతినిధిగా ప్రజల ప్రాణాలకు భరోసానిచ్చారు శైలజ. అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలోనే ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షలు నిర్వహించారామె. ముందుచూపుతో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో చాలా వరకు విజయం సాధించారు. కేరళ ప్రభుత్వం సమర్థంగా కరోనాను ఎదుర్కొనడంలో శైలజదే కీలక పాత్ర అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఆమె కృషిని ప్రశంసిస్తూ ఆర్టికల్స్ ప్రచురించాయి.

ప్రశంసల వర్షం...

ఇక పబ్లిక్‌ సర్వీస్ డేను పురస్కరించుకుని జూన్‌ 23న ఐక్యరాజ్యసమితి వర్చువల్గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శైలజపై ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రాస్పెక్ట్‌ అనే ఓ పత్రిక ‘టాప్‌ 50 థింకర్స్‌’ పేరిట ఓ పోల్‌ను నిర్వహించింది. సుమారు 20వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో శైలజ మొదటి స్థానంలో నిలిచారు. ఇక దేశం నుంచే కరోనాను తరిమికొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

నాకు వైద్యం తెలియదు !

కరోనా నియంత్రణకు సంబంధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న 63 ఏళ్ల శైలజ వైద్యురాలేమీ కాదు. అంతేకాదు.. ఆమె మంత్రి పదవిని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. కేరళలోని కన్నూర్‌ జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పనిచేశారు. కళాశాలలో చదువుతున్నప్పుడే సీపీఐ(ఎం) భావజాలం పట్ల ఆకర్షితురాలైన ఆమె ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరారు. 2004లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మూడు సార్లు ఎమ్మెల్యే...

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన ఆమె కూతుపరంబా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల క్రితం కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ చాలామంది ఆమెను శైలజా టీచరనే పిలుస్తారు. ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌ పేరు కూడా ‘శైలజ టీచర్‌’ అనే ఉంటుంది. ‘మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి నాకు వైద్య రంగంపై పెద్దగా అవగాహన లేదు. అయితే సైన్సు టీచర్‌గా, వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన అనుభవంతోనే మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిసున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పారామె.

గతంలోనూ!

కరోనా కన్నా ముందు 2018లో నిఫా వైరస్‌ కేరళను కుదిపేసింది. అయితే ఆ సమయంలో చురుగ్గా స్పందించిన శైలజ అప్పటికప్పుడు 40 వేలమంది వలంటీర్లను ప్రజారోగ్య విభాగంలోకి తీసుకున్నారు. వైద్యులు, అధికారులతో కలిసి పనిచేసి నిఫా వైరస్‌ను సాధ్యమైనంతవరకు నియంత్రించగలిగారు. ఆ సమయంలో ఆమె చేసిన కృషిని దేశమంతా అభినందించింది. ఈ క్రమంలో కేరళలో నిఫా వైరస్‌ విజృంభణ మీద మలయాళంలో ‘వైరస్‌’ అనే సినిమా వచ్చింది. ఇందులో శైలజను పోలిన పాత్రను వెండితెరపై కూడా చూపించడం విశేషం. ఆ పాత్రను ప్రముఖ నటి రేవతి పోషించారు.

ఇక గతేడాది కేరళలో సంభవించిన వరదల్లో ప్రాణనష్టం సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు శైలజ.

పుస్తకాలు చదవడమంటే ఇష్టం!

ఇక శైలజ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే... 1981లో భాస్కరన్‌ అనే ఉపాధ్యాయుడిని వివాహం చేసుకున్న ఆమెకు లసిత్‌, శోభిత్‌ అనే పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలూ ఇంజినీర్లే. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదివేందుకు ఎక్కువగా ఆసక్తి చూపే శైలజకు సంగీతం ఆస్వాదించడమన్నా ఇష్టమే.

ఇవీ చూడండి : 'నిరంతర వైద్యసేవలకు అదనపు సిబ్బందిని నియమిస్తాం'

ABOUT THE AUTHOR

...view details