తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2021, 4:43 AM IST

ETV Bharat / city

TRS Plenary 2021: తెరాస ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు.. గులాబీమయం కానున్న రాజధాని..

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ(TRS Plenary 2021) ఏర్పాట్లు తుది దశకు చేరాయి. హైటెక్స్‌లో రేపు జరగనున్న ప్లీనరీ(TRS Plenary 2021)కి గులాబీ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు ఆరువేలకు పైగా పార్టీ ప్రతినిధులు హాజరు కానున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తొమ్మిదో అధ్యక్షుడిగా రేపు లాంఛనంగా ఎన్నుకోనున్నారు. రాష్ట్ర, జాతీయ అంశాలపై ఏడు తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. ప్లీనరీ వేళ హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారింది.

Arrangements for TRS Plenary 2021 came to last stage
Arrangements for TRS Plenary 2021 came to last stage

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... ఏడున్నరేళ్లుగా నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్లీనరీ సమావేశాల(TRS Plenary 2021)కు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లోనే ప్లీనరీ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు సరైన సమయంగా భావిస్తున్న గులాబీ పార్టీ నాలుగేళ్లకోసారి జరిగే ప్లీనరీ(TRS Plenary 2021)కి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది తెరాస ప్రతినిధులు ప్లీనరీకి హాజరుకానున్నారు. ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. మహిళలకు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కా ధరించి హాజరు కావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ముస్తాబు చేస్తున్నారు. ప్లీనరీ వేదికపై తీగల వంతెన ఆకర్షణగా నిలవనుంది. ప్లీనరీలో తెరాస రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు... పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.

ఎనిమిదోసారి అధ్యక్షుడిగా..

తెరాస రాష్ట్ర అధ్యక్ష స్థానానికి కేసీఆర్‌ను మాత్రమే ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఎనిమిదోసారి లాంఛనంగా ఎన్నిక కానున్నారు. ఉదయం పదిగంటలకు ప్రతినిధుల వివరాల నమోదు చేసుకున్నాక 11 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. తర్వాత కేసీఆర్​ అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. ఇరవై ఏళ్ల ప్రస్థానంతో పాటు ఏడున్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ప్రతినిధులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులందరితో కలిపి దాదాపు 15వేల మందికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక వంటకాలతో భోజనాలు చేయనున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత.. రాష్ట్ర, జాతీయ రాజకీయ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.

గులాబీమయంగా నగరం..

తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. హైటెక్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో గులాబీ తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.

పార్కింగ్​ కోసం ఏర్పాట్లు..

వాహనాల పార్కింగ్‌ కోసం సభ చుట్టూ ఎనిమిది పార్కింగ్ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు హైటెక్స్ పార్కింగ్ ప్రాంగణాన్ని కేటాయించారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వాహన శ్రేణి కోసం.. ప్రత్యేకంగా ప్లీనరీ సభ వెనుక ఉన్న గేటు నుంచి సభ ప్రాంగణంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్కింగ్​ ఎక్కడెక్కడంటే...

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మండల కేంద్రాల నుంచి వచ్చే తెరాస ప్రజా ప్రతినిధులకు ఎటువంటి అంటాకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైటెక్స్ ప్రాంగణం సమీపంలో ఐదు చోట్ల పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు వేల వాహనాలు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్​ నుంచి వచ్చే వాహనాల కోసం జయభేరి క్లబ్ వెళ్లే దారిలో ఇరువైపులా దాదాపు నలభై ఎకరాల స్థలం కేటాయించారు. పటాన్​చెరు, కూకట్​పల్లి, మియాపుర్ నుంచి వచ్చే వాహనాలను కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వెనుక వరల్డ్ వన్ స్కూల్ ప్రాంగణంలో, నూతనంగా ఏర్పాటు చేసిన లింకు రోడ్డులో, నోవాటెల్ హోటల్ ప్రహరీ గోడ సమీపంలో, వసంత సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details