Amaravati farmers padayatra : ఉత్సాహంగా ముందుకు సాగుతున్న అమరావతి మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. 34వ రోజు శనివారం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన రైతులకు మద్దతుగా పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఆ సమయంలో ట్రాఫిక్ను నియంత్రించాల్సిన పోలీసులు ఇరువైపులా బస్సులు, లారీలను వదలడం వివాదాస్పదంగా మారింది. ఈ సమయంలో పాదయాత్రలో రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు దాడి చేశారు. శివ అనే బౌన్సర్పై సీఐ నాగమల్లేశ్వరరావు దాడి చేయటంతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా రైతులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల పోలీసులు అనుచితంగా మాట్లాడుతూ.. పలుమార్లు వేలు చూపించి బెదిరించారని మహిళలు ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగానే అడ్డు తగులుతున్నారు...
Amaravathi Farmers padayatra in nellore : రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారితోనూ పోలీసులు వాగ్వాదానికి దిగారు. నాయుడుపాళెం రోడ్డు దగ్గర రైతులపై పూలు చల్లతున్న స్థానికులను అడ్డుకున్నారు. పూలు చల్లడానికి వీల్లేదని సీఐ నాగమల్లేశ్వరరావు దుర్భాషలాడటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు భయపడేది లేదని, ఇలాంటి బెదిరింపులు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి పడుతున్నామన్నారు. రైతుల సహనాన్ని పరీక్షించేందుకు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని, కానీ మా సంకల్పానికి ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఓర్చుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. పోలీసుల తీరును ఇంతటితో వదలమని, శుక్రవారం నాటి ఘటనలపై ప్రైవేటు కేసులు నమోదు చేస్తామని ఐకాస ప్రతినిధులు తెలిపారు. పాదయాత్రలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు అన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.
జన నీరాజనాల నడుమ ఘన స్వాగతం...