తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2021, 10:42 AM IST

ETV Bharat / city

Aqua farming : ఆక్వాలో ఆక్రమణల వైరస్‌

ఆంధ్రప్రదేశ్​లోని కోస్తా జిల్లాల్లో వేల ఎకరాల్లో అనధికారికంగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఆక్వా చెరువుల వ్యర్థాలను అనేక మంది యథేచ్ఛగా కాలువల్లోకి వదిలి జలాలను కలుషితం చేస్తున్నారు. కోర్టుల ఆదేశాలూ బేఖాతరు చేస్తూ విచ్చల విడిగా చెరువులను తవ్వుతున్నారు.

aqua-farming-frauds-in-the-state
AQUA: ఆక్వాలో ఆక్రమణల వైరస్‌

ఆక్రమణల చెరువుల్లో అవినీతి చేపలు చెలరేగిపోతున్నాయి. అధికారం మాటున రౌడీ రొయ్యలు మీసం మెలేస్తున్నాయి. ఏపీలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లోనూ ఆక్వా ఆక్రమణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వేల ఎకరాల అన్‌సర్వే, డీ పట్టా భూముల్లో చెరువులు తవ్వుతున్నారు. నేతల అండతో కొల్లేరును కబ్జా చేసినవారు.. ఇటు సముద్ర తీరాన్నీ వదలడం లేదు. బకింగ్‌హాం కాలువను కనుమరుగు చేస్తున్నారు. అయినకాడికి ఆక్రమించి ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవడం, ఆ తీగలను నేలబారున వదిలేసి కాపలాదారులు, పనివారి ప్రాణాలతో చెలగాటమాడటం గత కొన్నేళ్లుగా జరుగుతున్న తంతే. తాజాగా గుంటూరు జిల్లాలో ఆరుగురు కార్మికులు రొయ్యల చెరువు కాపలాకు వచ్చి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిబూడిదయ్యారు. ఈ నేపథ్యంలో ఆక్వాలో ఆక్రమణలు, అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు, వాటి వల్ల పోతున్న ప్రాణాలు..

పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దాళ్వా పంట చేతికొచ్చే సమయంలో ఉప్పునీటి వల్ల ఎండిపోయిన వరిచేను

దేశవ్యాప్త చేపల సాగులో 30%, రొయ్యల సాగులో 40% వాటా మనదే. ఏటా 46 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 26.5 లక్షల మందికి మత్స్యరంగమే ఉపాధి చూపుతోంది. అయితే ఆక్వా రైతుల ముసుగులో కొందరు నేతలు, వ్యాపారులు ప్రభుత్వ, అసైన్డ్‌, జలవనరులశాఖ భూముల్ని గుప్పిట పడుతున్నారు. నిబంధనల ప్రకారం.. నదులు, సముద్రపునీరు చొచ్చుకొచ్చే ప్రాంతాలకు (హై టైడ్‌లైన్‌ -హెచ్‌టీఎల్‌) రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండే భూముల్లో సాగుకు అనుమతిచ్చే అధికారం కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ)కే ఉంటుంది. కానీ, అనుమతులు తీసుకోకుండానే సాగు చేస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో కనుచూపు మేర అంతా ఆక్వా సాగే. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలో మడ అడవుల్ని నరికేసి రొయ్యల చెరువులుగా మార్చారు. సుమారు 2,500 ఎకరాల్లో అనధికార సాగు జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ మడ అడవుల్ని నరికేసి సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో చినగంజాం నుంచి గుడ్లూరు వరకు బకింగ్‌హామ్‌ కాలువను ఆక్రమించి చెరువులు తవ్వారు.

డీపట్టాలు.. ప్రభుత్వ భూముల్లోనూ..

కృష్ణా జిల్లా మండవల్లి మండలం నందిగామలంక, ఉనికిలి గ్రామాల్లో 500 ఎకరాల డీ పట్టా భూముల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మండవల్లిలో శ్యాంప్‌ డ్రెయిన్‌, కైకలూరులోని పుల్లవ డ్రెయిన్లు ఆక్రమణలకు గురయ్యాయి. గుంటూరు జిల్లా తీరంలోని అన్‌సర్వే భూముల్లోనూ చెరువులు తవ్వారు. నిజాంపట్నం మండలం దిండి, కొత్తపాలెం, కర్లపాలెం మండలం తుమ్మలపల్లి, పెదపులుగువారిపాలెం, పేరలి, రేపల్లె మండల తీరంలోని గ్రామాల్లోని అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో 4 వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు చేస్తున్నారు. రేపల్లె మండలంలో లంకెవానిదిబ్బ, రాజుకాల్వ, గంగడిపాలెం, మోళ్లగుంట, తుమ్మల, పోటుమెరక, చాట్రగడ్డ, కామరాజుగడ్డ, పెనుమూడి పంచాయతీ శివార్లలో.. అసైన్డ్‌ భూముల్లోనే చెరువులు తవ్వేశారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఎస్‌.పల్లిపాలెం, కొమరగిరిపట్నం, గోడి, బెండమూర్లంక, ఓడలరేవు, సామంతకుర్రు తదితర గ్రామాల్లో 600 ఎకరాల్లో డి పట్టా భూముల్ని లీజులకు తీసుకుని చెరువులు తవ్వారు. కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో 3,800 ఎకరాల్లో అనధికార తవ్వకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, వారి బంధువులే తక్కువ విస్తీర్ణానికి అనుమతి తీసుకుని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో 400 ఎకరాల్లో సాగు చేస్తుంటే... అనుమతులు వందెకరాలకే! నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు దగ్గర పెన్నానదిలో సుమారు 200 ఎకరాలు, అల్లూరు మండలంలో వాగు ఆక్రమించి సుమారు 500 ఎకరాలు, గోగులపల్లి, ఉప్పుకొటారు ప్రాంతాల్లో 500 ఎకరాలు, పైడేరు, కలుజు వాగు అంచున 100 ఎకరాలు ఆక్రమించి సాగు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో విద్యుత్తు ట్రాన్స్​ఫార్మర్ నుంచి నేలపై లాగిన విద్యుత్ వైర్లు

పంటలకు ఉప్పు సెగ

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో రేకులషెడ్డులో ఉంచిన బ్లీచింగ్, సున్నం గోతాలు(లోపల కూలీలు)

రొయ్యలు, చేపల చెరువుల్లో రసాయనాల వాడకం పెరుగుతోంది. బ్లీచింగ్‌, ఫార్మాలిన్‌తో పాటు క్లోరైడ్లు, ఫాస్ఫైడ్లు, యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తారు. వ్యర్థ జలాలను పంటకాల్వల్లోకి వదులుతున్నారు. దీంతో మంచినీటి కాలువలు ఉప్పుమయంగా తయారవుతున్నాయి. వ్యర్థ జలాలను పంటకాలువల్లోకి వదిలేయడంపై తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామస్థులు అమలాపురం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కోనసీమలో రొయ్యల చెరువుల్లో వాడే రసాయనాల వల్ల కొబ్బరిచెట్లు తలలు వాల్చేస్తున్నాయి. సఖినేటిపల్లి, అంతర్వేది తీరాల్లో అంగన్‌వాడీ కేంద్రాల పక్కనే రొయ్యల చెరువులున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు, పెదనిండ్రకొలను కొల్లేరు పరిధిలో 5వ కాంటూరు నుంచి 3 కాంటూరు వరకు సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో గతంలో రబీ సాగు జరిగేది. ఆక్వా విస్తరణతో దిగుబడులు పడిపోవడంతో రైతులు సాగు మానేశారు. వీరవాసరం మండలంలో పంట, మురుగుబోదెల ఆక్రమణలు తొలగించకపోతే పంటవిరామం పాటిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 450 ఎకరాలపైనే పంటలు పండించేవారు. నేడు 100 ఎకరాల్లోనూ పంటల్లేవు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోనూ రొయ్యల సాగు కారణంగా.. వాటి పక్కనుండే వ్యవసాయ భూములు చౌడుబారుతున్నాయి. పాయకరావుపేట మండలంలో పంపానదీ జలాలు కాలుష్యం కావడంతో ఇటీవల రెండు కిలోమీటర్ల మేర నదిలోని చేపలు చనిపోయాయి. ఆక్వా సాగు జరిగే ప్రాంతాల్లో వందల గ్రామాల్లోని భూగర్భజలాలు ఉప్పుమయమయ్యాయి. బావులు, బోర్లలో తాగునీరు నిరుపయోగమైంది. దాహం తీరాలంటే మినరల్‌ నీళ్లే దిక్కు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని అధికశాతం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. కొల్లేరు గ్రామాల్లో మరీ దుర్భరం. గ్రామాలకు తాగునీరు వెళ్లే కాలువల్లోకి వ్యర్థ జలాలను వదలడంతో ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చెంచులగరువు, దొంతికుర్రులోని పెదచెరువు, మిలటరీపేట గ్రామాల్లో బోర్లు, బావుల్లో నీరు ఉప్పగా మారిపోయింది. ఆక్వాసాగుతో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో 8 పంచాయతీలు, బాపట్ల మండలం కప్పలవారిపాలెంలో భూగర్భజలాలు ఉప్పగా మారాయి.

ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి..

కళ్లెదుటే ఆక్రమణలు కనిపిస్తున్నా.. అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం పిట్టువానిపల్లి, పీవీకండ్రిగ, రంగనాథపురం గ్రామాల్లో అనుమతులు లేకుండా రొయ్యలసాగు చేపట్టారని పలువురు గతేడాది ఎన్జీటీ చెన్నై బెంచ్‌ని ఆశ్రయించడంతో.. ధర్మాసనం కమిటీ వేసింది. వారి నివేదిక మేరకు అక్రమ సాగుపై చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. దీంతో 110.08 హెక్టార్లలో సాగవుతున్న 175 ఆక్వా చెరువులను తొలగించారు. మరో 20 మందికి చెందిన 66 చెరువుల విషయం కోర్టులో ఉంది.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పులగుప్తం మండలం చల్లపల్లిలో అంగన్వాడీ కేంద్రం పక్కనే చేపల చెరువు

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరులో 3 ఎకరాలకు అనుమతి తీసుకుని 14 ఎకరాల్లో చెరువు తవ్వేశారు. మొదట్లోనే రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు మురుగునీటి పారుదల సౌకర్యం లేదని నిర్ధారించినా, చెరువు తవ్వకం ఆగలేదు. చివరకు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్​జీటీ ఆదేశాలతో నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో తొలగిస్తున్న రొయ్యల చెరువులు

* శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం రుంకుహనుమంతపురం రెవెన్యూ పరిధిలోని జగన్నాథపురం సర్వే నంబరు 315లో మొత్తం 265 ఎకరాల పోరంబోకు భూమిలో 150 ఎకరాల్లో చెరువులు తవ్వారు. దీనిపై స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. 2016లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా తొలగించలేదు.

‘చీకటి’ వెలుగులు

చేపలు, రొయ్యలకు ప్రాణవాయువు అందించే ఏరియేటర్లకు విద్యుత్తు అవసరం. అనధికార చెరువులకు, సీఆర్‌జెడ్‌ పరిధిలోని వాటికీ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో అనధికారిక మీటర్లను విద్యుత్‌శాఖ అధికారులు తనిఖీచేసి రూ.లక్షల్లో జరిమానాలు విధించినా ఇప్పటికీ అక్రమ వాడకం కొనసాగుతోంది. చెరుకుపల్లి, కర్లపాలెం, నిజాంపట్నం మండలాల్లో చెరువు గట్ల మీదుగా కర్రలతో తీగలు లాగారు. దీంతో గతంలో పలువురు రైతులు, కూలీలు విద్యుదాఘాతంతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడకు చెందిన ఆక్వా రైతు ఆరేపల్లి సుబ్బారావు గడ్డి కోస్తుండగా కిందపడి ఉన్న విద్యుత్తు తీగకు కొడవలి తగిలి అక్కడికక్కడే మరణించారు. ఇలా రాష్ట్రంలో ఏటా పలువురు విద్యుదాఘాతంతో మరణిస్తున్నారు.

ప్రాణాలు అరచేత పట్టుకుని నివాసం

చెరువుల్లో వాడే రసాయనాల్లో కొన్నింటికి మండేగుణం ఉంటుంది. గట్లపై షెడ్లలో వీటిని నిల్వచేస్తారు. కార్మికులూ అక్కడే ఉండాలి. ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఇటీవల ఆరుగురి మరణానికి ఇదీ ఒక కారణం. 2020 మే 15న పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గొంతేరు డ్రెయిను సమీపంలోని ఆక్వాచెరువు వద్ద షెడ్డులో రసాయనాల పేలుడుతో ఇద్దరు మరణించారు.

ఈ-క్రాప్‌ పక్కాగా చేస్తే..

ఈ-క్రాప్‌ ద్వారా చెరువుల విస్తీర్ణం పక్కాగా వెల్లడవుతుంది. కొన్ని జిల్లాల్లో ఆక్వాసాగు అధికారుల అంచనాకు మించి ఉంది. అసైన్డ్‌, డీ పట్టా భూములతో పాటు తీరంలో సాగయ్యే ప్రతి ఎకరానూ ఈ-క్రాప్‌ పరిధిలోకి తీసుకొస్తే.. మొత్తం అనధికార సాగు విస్తీర్ణం లెక్కతేలుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఇదీ చూడండి:BEGGAR FREE CITY: మాటలకే పరిమితమవుతున్న యాచకరహితనగరం

ABOUT THE AUTHOR

...view details