తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 7:39 AM IST

ETV Bharat / city

ఏపీకి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు కేటాయించే అవకాశం: ఏపీ సీఎం

కొవిడ్ వ్యాక్సిన్​ తొలిదశ పంపిణీలో కేంద్రం ఏపీకి కోటి కొవిడ్​ వ్యాక్సిన్లు కేటాయించే అవకాశం ఉందని సీఎం జగన్​ అన్నారు. పీటీఐ కథనం ప్రకారం.. ఏపీ అసెంబ్లీలో కరోనా చర్యలపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ కేటాయింపు, నిల్వ, సరఫరాపై మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చిన సంకేతాల మేరకు వచ్చే మూడు, నాలుగు నెలల్లో కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుందని సీఎం జగన్ చెప్పారు. వ్యాక్సినేషన్​కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

ఏపీకి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు
ఏపీకి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు

వచ్చే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రానికి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ అయ్యే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి​ అన్నారు. వ్యాక్సిన్ల నిల్వ, పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. పీటీఐ కథనం ప్రకారం.. ఏపీ శాసనసభ సమావేశాల్లో కరోనా నివారణ చర్యలపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన విధానాలపై చర్చించారు.

ఏపీలో కోటి మందికి

మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుందని కేంద్రం స్పష్టం చేసినట్లు సీఎం తెలిపారు. వ్యాక్సిన్ తొలిదశ పంపిణీలో ఏపీలో కోటి మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సంకేతాల మేరకు వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

తొలిదశలో వారికే..

వ్యాక్సిన్ తొలిదశ పంపిణీలో 3.6 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, 7 లక్షల ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ అయిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, 50 ఏళ్లకు పైబడిన సుమారు 90 లక్షల మందికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. వ్యాక్సిన్​ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతతో 4065 శీతల గిడ్డంగులు, 29 రిఫ్రిజిరేటర్​ వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్​కు అవసరమైన కోల్డ్​ బాక్సులు, సిరెంజ్​లను కేంద్ర ప్రభుత్వం అందించాలని కోరారు.

ఎఎన్​ఎమ్ సిబ్బంది సేవలు..

కొవిడ్ టీకా వేసేందుకు 19,000 ఎఎన్​ఎమ్ సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని సీఎం జగన్​ అన్నారు. ఆశావర్కర్లకు వ్యాక్సిన్​ వినియోగంపై తగిన శిక్షణ ఇస్తామన్నారు. ​కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా ప్రజలు కొన్ని నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్​ సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్​ వచ్చిన వెంటనే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని, దశల వారీగా అందిస్తామన్నారు. అందువల్ల ప్రజలు మరికొంత సమయం అప్రమత్తంగా ఉండాలన్నారు. దిల్లీ, గుజరాత్​, మధ్యప్రదేశ్​లో ఉష్ణోగ్రతలు తగ్గే కొలది కేసులు పెరుగుతున్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు.

ఇదీ చదవండి :ఈనెల 7న విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

ABOUT THE AUTHOR

...view details