ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి(single judge) తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్(division bench)కు వెళ్లింది. డివిజన్ బెంచ్లో హౌస్మోషన్ పిటిషన్(house motion petition) దాఖలు చేసింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను స్వీకరించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులు..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను ఉన్నత న్యాయస్థానం(సింగిల్ బెంచ్) ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని శుక్రవారం తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది.
అర్హులకు పట్టాలు ఇవ్వాలి...
ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.