తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2021, 10:30 AM IST

ETV Bharat / city

COTTON FARMERS in AP : దుఃఖంలో.. దూదిపూల రైతు!

పత్తి ధర పెరిగిందని సంతోషించేలోపే.. ధరలు నేలకేసి చూస్తున్నాయి. వారం వ్యవధిలోనే క్వింటా రూ.1,000 నుంచి రూ1,500 మేర తగ్గింది. వానల భయంతో పత్తితీత కూలి క్వింటాలుకు రూ.500 పెరిగింది. అటు ధరలు తగ్గడం, ఇటు ఖర్చులు పెరగడంతో క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2వేల మేర రైతులు నష్టపోతున్నారు. దీనికితోడు అక్కడక్కడ గులాబీ పురుగు తాకిడి మొదలైంది. ఈ ఏడాదైనా పత్తిలో కొద్దోగొప్పో మిగులుతుందనుకుంటే, అదీ కుదిరేలా కన్పించడం లేదనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో తగ్గని ధరలు ఇక్కడే ఎందుకు తగ్గుతున్నాయని ఏపీ పత్తి రైతులు ప్రశ్నిస్తున్నారు.

cotton farmers
cotton farmers

ఏపీలో నవంబరు మొదటి వారం నుంచి పత్తితీతలు పెరిగాయి. ధరలు బాగుండటంతో రైతులు వెంటనే అమ్మేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరల్ని తగ్గిస్తున్నారు. అక్టోబరు 28న కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో కనిష్ఠంగా క్వింటా రూ.7వేల వరకు లభించిన ధర ఇప్పుడు రూ.4,800కి తగ్గింది. నవంబరు 2న క్వింటా గరిష్ఠంగా రూ.9,011 చొప్పున ఉంటే, ఇప్పుడు రూ.8వేలకు పడిపోయింది.

  • గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని పలు గ్రామాల్లో గత వారం వరకు క్వింటా పత్తికి రూ.8వేల వరకు ఇచ్చి కొన్నారు. తర్వాత క్రమంగా తగ్గిస్తూ.. ఇప్పుడు రూ.7వేల వరకే ఇస్తున్నారు. ఆలస్యం చేస్తే ఈ ధర కూడా ఉండదేమోనని రైతులు అమ్మేస్తున్నారు. పత్తి గింజలకు క్వింటా రూ.600 వరకు, దూది ధరలు క్యాండీకి రూ.4,500 వరకు తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో నిలకడగా

దేశంలో పత్తిని సాగుచేసే ఇతర రాష్ట్రాల్లో ధరలు నిలకడగానే ఉన్నాయి. శుక్రవారం పంజాబ్‌లోని అబోహర్‌, హరియాణాలోని శివాని, రాజస్థాన్‌లోని పిలిబంగ మార్కెట్లలో పత్తికి క్వింటా కనిష్ఠంగా రూ.7,350 పైన, గరిష్ఠంగా రూ.8,980 వరకు (ఈనాం మార్కెట్‌ సమాచారం) ఉంది. తెలంగాణలోని వరంగల్‌ మార్కెట్లోనూ క్వింటా కనిష్ఠంగా రూ.7,050, గరిష్ఠంగా రూ.7,810 చొప్పున లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే కనిష్ఠ ధరలు తక్కువగా ఉన్నాయి.

  • అంతర్జాతీయంగానూ పత్తి ధరల్లో పెద్దగా తేడా లేదు. అమెరికా ఫ్యూచర్‌మార్కెట్లో పౌండ్‌ (453.592 గ్రాముల) దూది 118 నుంచి 119 సెంట్ల వద్ద నమోదవుతోంది. 10రోజుల కిందటి ధరలే ఉన్నాయి.

పెరుగుతున్న ఖర్చులు..

అల్పపీడన హెచ్చరికలు, ముసురు వాతావరణంతో పత్తితీతలకు రైతులు త్వరపడుతున్నారు. దీంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. వారం కిందటి వరకు కిలోకు రూ.10 చొప్పున ఉంటే ఇప్పుడు రూ.15 అయింది. క్వింటా రూ.500 వరకు పెరుగుతోంది.

  • గులాబీరంగు పురుగు కారణంగా కాయల్లో పుచ్చు కన్పిస్తోంది. దీంతో ఎకరాకు 2క్వింటాళ్ల వరకు దిగుబడులు తగ్గుతున్నాయి.
  • వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్నూలు జిల్లాలోని అధికశాతం మండలాల్లో ఎకరాకు 2నుంచి 3క్వింటాళ్లే వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో తీతలకు సిద్ధంగా ఉన్న పత్తి తడుస్తోంది.
  • పత్తిలో తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత అంతగా లేదని చెబుతున్న వ్యాపారులు ధరల్ని తగ్గిస్తుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details