తెలంగాణ

telangana

AP employees strike: 'సోమవారం సీఎస్​కు నోటీసు.. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె'

By

Published : Jan 21, 2022, 3:32 PM IST

AP employees strike: ఏపీ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. విజయవాడలో భేటీ అయిన సంఘ నేతలు.. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టాలని.. 7న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి.

Andhra pradesh employees strike, ap prc issue
పీఆర్సీపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నిరసన

AP employees strike: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఏన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. సీఎస్‌ సమీర్‌శర్మను సోమవారం కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి. అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి.

అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు

ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం అసోసియేషన్‌ హాలులో మరోసారి ఆయా సంఘాలన్నీ భేటీ కానున్నాయి. అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఐకాస నేతలు సంతకాలు చేయనున్నారు.

"విధివిధానాలు ఎలా ఉండాలన్నదానిపై చర్చించాం. పోరాట కార్యాచరణపై సమావేశంలో చర్చించా. మీడియా సమావేశంలో అన్ని వివరాలు చెబుతాం"

- బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో అధ్యక్షుడు

మరోవైపు ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి తేవొద్దని పేర్కొంది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఏపీ ఉద్యోగ సంఘాలు

ఉద్యోగుల పీఆర్సీ జీవోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య కోర్టును ఆశ్రయించారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని పేర్కొన్నారు. సెక్షన్ 78(1)కి విరుద్ధమైన జీవో రద్దుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.

"విభజన చట్టం ప్రకారం వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో వేతనాల్లో కోత పడుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొంది. పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమిస్తూనే న్యాయపరంగా ముందుకెళ్తాం. సీఎస్‌, ఆర్థిక శాఖ, రెవెన్యూ, కేంద్ర హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చాం" - కె.వి.కృష్ణయ్య, ఏపీ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం

ఇదీ చదవండి:AP EMPLOYEES JAC: 'ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం'

ABOUT THE AUTHOR

...view details