తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 12:39 PM IST

ETV Bharat / city

Gowtham Reddy: నెల్లూరులోని మేకపాటి నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

Gowtham Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే ఉంచారు. మేకపాటి చివరి చూపు కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.

Gowtham Reddy, ap minister death
నెల్లూరులోని మేకపాటి నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

Gowtham Reddy : గుండెపోటుతో సోమవారం కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక విమానం ద్వారా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్​కు తీసుకువచ్చారు. అక్కడినుంచి డైకస్ రోడ్డులోని మేకపాటి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహన్ని ఉంచారు. ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేకపాటి చివరి చూపు చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి ఉదయగిరికి భౌతికకాయాన్ని తరలిస్తారు.

నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయ సందర్శన, అంత్యక్రియల ఏర్పాట్లను ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గౌతమ్‌ రెడ్డి అంతిమయాత్ర రోడ్డు మార్గంలో ఉదయగిరి వరకు జరుగుతుందని మంత్రి అనిల్ తెలిపారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ సహా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అనిల్ తెలిపారు.

నెల్లూరులోని మేకపాటి నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలింపు..

మంగళవారం ఉదయం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి... అక్కడినుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు తరలించారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. మరోవైపు ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన చేరుకునే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గౌతమ్ రెడ్డి మృతి.. ఏం జరిగిందంటే..?


ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గౌతమ్‌రెడ్డి ఏపీ రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఇదీ చదవండి:Minister Gautam Reddy: మాటల్లో సౌమ్యం... మంచితనానికి నిలువెత్తు నిదర్శనం

ABOUT THE AUTHOR

...view details