ANDHRA PRADESH EMPLOYEES FIRE ON PRC : పీఆర్సీ అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే సమ్మె చేయాలనీ భావిస్తున్నారు. ఐకాసలు కార్యాచరణ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనాలని నిర్ణయించారు. పలుచోట్ల ఉపాధ్యాయులు ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. జీవోల ప్రతులను దహనం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన తెలిపారు. ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య (ఫ్యాప్టో) ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడలకు ఫ్యాప్టో పిలుపునిచ్చింది.
కలెక్టరేట్ వద్ద ఆందోళన..
- కర్నూలు కలెక్టరేట్ ముందు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవోల ప్రతులను దహనం చేశారు. నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాలకు హాజరయ్యారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు.
- నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఎంఈవో కార్యాలయాలు, కూడళ్లలో ఉపాధ్యాయులు ఉత్తర్వుల ప్రతులను మంటల్లో తగలబెట్టారు. రద్దు చేసిన భత్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
- గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చారని, వీటిని అంగీకరించబోమని ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు.
- కృష్ణాజిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనను తెలియజేశారు. పలు మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు. విజయవాడ మున్సిపల్ ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో జీవోలను దహనం చేశారు. నందిగామ, జగ్గయ్యపేటల్లో భారీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయ నిరసనకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు పలికారు.
భారీ ప్రదర్శనలు
- పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. కొయ్యలగూడెం, గుండుగొలను, పెదపాడు, టి.నరసాపురం వంటి ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఉత్తర్వుల ప్రతులను మంటల్లో తగలబెట్టారు.
- తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగర తహసీల్దారు కార్యాలయం నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. సీతానగరంలోని మండల పరిషత్తు కార్యాలయం, పెద్దాపురంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పి.గన్నవరం తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అయినవిల్లి పీహెచ్సీ వద్ద ఉద్యోగుల నిరసన వ్యక్తం చేశారు.
- విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామసమయంలో నినాదాలు చేసి, ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు.
- విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఉపాధ్యాయులు విశాఖ-అరకు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఉత్తర్వుల ప్రతులను ఉపాధ్యాయులు దహనం చేశారు. పాఠశాలల్లో భోజన విరామ సమయంలో పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో ఆందోళనలు నిర్వహించారు. అనంతరం పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు.
- చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి.. భోజన విరామ సమయంలో నిరసనలు తెలిపారు. చిత్తూరు తహసీల్దారు కార్యాలయం వద్ద సాయంత్రం పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఐటీఐ కళాశాల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి.. నినాదాలు చేసి అనంతరం జీవో ప్రతులను దహనం చేశారు.