తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2020, 9:49 AM IST

ETV Bharat / city

ఏపీలో 28కి చేరిన కరోనా అనుమానితులు

ఏపీ రాష్ట్రంలో మరో ఏడుగురు కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరితో మొత్తం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 28కి చేరింది. ఇప్పటి వరకు 79 అనుమానితుల నమూనాలాను పరీక్షలకు పంపగా.. వాటిలో 65 మందికి వ్యాధి లేదని నిర్థరణైంది. మరో 13 నివేదికలు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం-1897ను అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది

andhra-pradesh-corona-virus-news
ఏపీలో 28కి చేరిన కరోనా అనుమానితులు

ఏపీలో 28కి చేరిన కరోనా అనుమానితులు

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌.. ఏపీ రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది. ఆదివారం మరో ఏడుగురు వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరితో కలిపి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 28కి చేరింది. గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాల, మదనపల్లె ప్రభుత్వాసుపత్రుల్లో ఇద్దరేసి చొప్పున కరోనా అనుమానితులు చేరారు. ఇటీవలే వియత్నాం నుంచి వచ్చిన మహిళ.. గుంటూరు ఆసుపత్రిలో చేరారు. చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన ఓ వ్యక్తి, మరో మహిళ జలుబు, దగ్గుతో మదనపల్లెకు వచ్చారు. వీరిద్దరు ఇటీవలే కువైట్‌ నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిని తిరుపతి రుయాకు పంపారు.

విశాఖకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి నెలపాటు కోయంబత్తూరులో విదేశీయులతో కలిసి యోగా శిక్షణ పొందారు. 4 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు. దగ్గు, జ్వరంతో ఛాతీ ఆసుపత్రిలోని కరోనా వార్డును ఆశ్రయించారు. ఆయనతో కలిపి విశాఖలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఐదుకు చేరగా.. ముందు చేరిన నలుగురి ఆరోగ్యం మెరుగుపడిందని అధికారులు తెలిపారు.

రష్యా నుంచి అనంతపురం వచ్చిన ఓ యువకుడు కరోనా అనుమానంతో సర్వజనాసుపత్రిలో చేరగా అతనికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపగా.. ఫలితం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 79 అనుమానితుల నమూనాలాను పరీక్షలకు పంపామని.. వాటిలో 65 మందికి వ్యాధి లేదని నిర్థరణ అయినట్లు అధికారులు చెప్పారు. మరో 13 నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు.

అమల్లోకి అంటువ్యాధుల చట్టం-1897

విదేశాల నుంచి 991 మంది తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారని ఇంటింటి సర్వేలో సిబ్బంది గుర్తించారు. వీరందరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. కాకినాడ బోధనాస్పత్రిలో కరోనా అనుమానితుడి అదృశ్యం కలకలం రేపింది. అతని ఇంటికి వెళ్ళిన వైద్యులు.. మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెల్లూరు బోధనాసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉన్న కరోనా పాజిటివ్‌ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం-1897ను అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టాన్ని అనుసరించి ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత 6 వేల మంది రాష్ట్రానికి వచ్చారు. వీళ్లను ఎటూ వెళ్లకుండా ఇళ్లల్లో ఉండాలని ఆదేశించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 30 శాతం తగ్గింది. వ్యాధి నియంత్రణను కాంక్షిస్తూ తిరుమలలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో ధన్వంతరీ హోమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details