తెలంగాణ

telangana

ఏపీలో విజయవాడ కార్పొరేషన్​ మేయర్ అభ్యర్థి ఎవరు?

By

Published : Mar 15, 2021, 1:33 PM IST

ఏపీలోని విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న వైకాపాలో.. ఇప్పుడు మేయర్‌ అభ్యర్థి ఎవరనేది ఆసక్తి రేపుతోంది. పోటీ ఎక్కువగా ఉండడం.. రసవత్తరంగా మారింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో మాత్రమే తెలుగుదేశం కాస్త పట్టు నిరూపించుకోగలిగింది.

ఏపీలో విజయవాడ కార్పొరేషన్​ మేయర్ అభ్యర్థి ఎవరు?
ఏపీలో విజయవాడ కార్పొరేషన్​ మేయర్ అభ్యర్థి ఎవరు?

ఏపీలో జరిగిన పురపోరులో ప్రతిష్టాత్మకంగా భావించిన విజయవాడ నగరపాలికలో వైకాపా తిరుగులేని ఆధిక్యం సాధించింది. నగరంలోని 64 డివిజన్లలో 49 స్థానాలను గెలుచుకొని విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అమరావతి అంశం ప్రభావం చూపుతుందని భావించినా.. ఫలితాల్లో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. తూర్పు నియోజకవర్గంలోనే తెదేపా కాస్త ఫర్వాలేదనిపించింది. మొత్తం గెలిచిన 14 మంది అభ్యర్థుల్లో ఈ నియోజకవర్గం నుంచే ఏడుగురు గెలుపొందారు. విజయవాడ సెంట్రల్​లో 4, పశ్చిమలో 3 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం డివిజన్లలో తెదేపా 10వ డివిజన్ అభ్యర్థి దేవినేని అపర్ణ అత్యధికంగా 2వేల 640ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

విజయవాడ నగరపాలికలో తిరుగులేని గెలుపు సొంతం చేసుకున్న వైకాపా.. ప్రస్తుతం మేయరు పీఠంపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు మేయరు అభ్యర్థిని ప్రకటించని సీఎం జగన్‌.. ఎన్నికల తర్వాతే ఎంపిక చేయాలని భావించారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆశావహులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మేయరు పీఠాన్ని ఆశించిన వైకాపా నేత గౌతంరెడ్డి కుమార్తె.. డాక్టర్‌ లిఖితారెడ్డి ఓడి పోవడం వల్ల పోటీ తగ్గినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం 34వ డివిజన్​ నుంచి విజయం సాధించిన బండి నాగపుణ్యశీల పేరు మేయర్ పరిశీలనలో ఉంది. గత కౌన్సిల్‌లో ఫ్లోర్‌ లీడర్‌గానూ పని చేసిన ఆమె.. సీఎం జగన్‌ తనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మరోవైపు పశ్చిమ నియోజకవర్గానికే మేయర్‌ ఇవ్వాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మధ్య నియోజకవర్గానికే కావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం 42 వ డివిజన్‌ నుంచి గెలిచిన చైతన్య రెడ్డి పేరు మంత్రి ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి జగన్​ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మధ్య నియోజకవర్గంలోని 58వ డివిజన్‌ నుంచి గెలిచిన అవుతు శ్రీశైలజరెడ్డి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డికి.. సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

తూర్పు నియోజకవర్గానికి డిప్యుటీ మేయర్‌ కావాలని ఇన్​ఛార్జి దేవినేని అవినాష్‌ అడుగుతున్నారు. ఇది ఖాయమైనట్లు తెలుస్తోంది. మేయరు పదవి రెండున్నరేళ్లు పంపకాలు ఉండే అవకాశాలు లేకపోలేదని వైకాపా వర్గాలు అంటున్నాయి. ఈనెల 18న మేయరు, డిప్యూటీ మేయరు, ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎంపిక జరుగనుంది.

ఇదీ చదవండి:గవర్నర్​ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details