తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2022, 12:48 PM IST

Updated : Mar 3, 2022, 4:57 PM IST

ETV Bharat / city

Amaravati Movement : మూడు రాజధానుల ప్రకటన తర్వాత కీలక ఘట్టాలు

Amaravati Movement : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు..

Amaravati Movement
Amaravati Movement

  • 17-12- 2019: ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్‌ 3 రాజధానుల ప్రకటన
  • 18-12-2019: ఉద్యమానికి పిలుపునిచ్చిన అమరావతి ఐకాస
  • 27-12-2019: అమరావతి భూములపై విచారణకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం
  • డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో భూములు కొన్నారని ఆరోపణ
  • 2014 జూన్- డిసెంబర్ వరకు తెదేపా నేతలు భూములు కొన్నారని అభియోగం
  • 4,075 ఎకరాలు కొన్నారని మంత్రివర్గ అభియోగం
  • 13-1-2020: రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడంపై హైకోర్టు సీరియస్
  • రాష్ట్రంలో ఏం జరగుతోందంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
  • చట్టం అమలు డీజీపీ, సీఎస్‌లకూ తెలీదా అంటూ ఘూటు వ్యాఖ్యలు
  • శాంతియుత ఉద్యమాలను అడ్డుకోవద్దని పోలీసులకు స్పష్టీకరణ
  • 17.01.2020: రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు
  • ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటుకాలుతో తన్నిన పోలీసులు
  • మగ పోలీసులతో మహిళలను అరెస్టు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
  • 23-1-2020: రాజధాని వ్యాజ్యాల విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా
  • ఈ లోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు వద్దని ఆదేశం
  • ధిక్కరిస్తే ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారని హెచ్చరిక
  • ఖర్చు చేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతామన్న హైకోర్టు
  • 03-02-2020: అమరావతి భూములపై రంగంలోకి దిగిన ఈడీ
  • భూ అక్రమాలపై నిర్ధిష్టమైన ఆధారులు లేవన్న ఏపీ సీఐడీ
  • 796 మంది తెల్ల రేషన్ కార్డు దారులు భూములు కొన్నారని ఆరోపణ
  • ప్రాథమికంగా గుర్తించిన ఆదారాలు ఈడీకి అందజేత
  • 4-2-2020: కార్యాలయాల తరలింపునకు ఎందుకంత తొందరన్న హైకోర్టు
  • బిల్లులు కోర్టులో ఉండగా తొందర ఎంజుకని ప్రశ్నించిన హైకోర్టు.
    20-02-2020: భూ అక్రమాల ఆరోపణలపై సిట్ ఏర్పాటు
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికతో సిట్
  • 27-2-2020: జీఎన్‌ రావు, బోస్టన్ కమిటీ ఫైళ్లన్నీ అప్పగించాలన్న హైకోర్టు
  • 28-2-2020: రాజధానికిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్న
  • 31-07-2020: సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం
  • 04-08-2020: 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై హైకోర్టు స్టేటస్‌ కో
  • 06-08-2020: ప్రజాధనం వృధా అయితే చూస్తూ ఊరుకోమన్న హైకోర్టు
  • రాజధాని నిర్మాణం మధ్యలో నిలిపేస్తే నష్టానికి బాధ్యత ఎవరిదని ప్రశ్న
  • అప్పటి వరకు చేసిన ఖర్చు, నిర్మాణాలు పురోగతిపై పూర్తి వివరాలకు ఆదేశం
  • 11-8-2020: ‘‘AMARAVATI METROPOLITAN REGION DEVELOPMENT AUTHORITY’’ అనే పేరుతో ఏర్పాటు చేసిన వెబ్ సైట్. అమరావతిలో నిర్మించిన భారీ భవనాలు. crda.gov.ap.in లింకును ఓపెన్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఫోటోలు
  • 17-8-2020: రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిసన్ కొట్టివేత. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై స్టే ఇచ్చిన హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాధమిక సాక్ష్యాధారాలున్నాయని.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన.
  • 26-8-2020: రాజధాని అమరావతి మార్పునకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు.
  • 26-08-2020: వార్షిక కౌలు కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తున్న రైతులపై కేసులు పెట్టి స్టేషన్ కు తరలించారు. జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ రెండు జీవోలు(RT-280, RT-279) జారీ చేసినా.. ఏ ఒక్క రైతు ఖాతాలోకీ నేటికీ కౌలు మొత్తం జమకాలేదు.
  • 27-8-2020: మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ చట్ట రద్దు కేసులో సెప్టెంబర్ 21 నుండి రోజువారీ విచారణ కొనసాగించడానికి న్యాయవాదులతో చర్చించిన హైకోర్టు. రాజధాని మార్పుపై స్టేటస్ కో సెప్టెంబర్ 21 వరకు కొనసాగింపు.
  • 27-8-2020: రాజధాని రైతులకు రెండు రోజుల్లో కౌలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం.
  • 21-09-2020 రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రైతులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు వేసిన 93 పిటిషన్లపై రోజు వారీ విచారణ. అక్టోబర్ 5కు వాయిదా వేసిన హైకోర్టు. అక్టోబర్ 5 నుండి రోజువారీ విచారణ.
  • అమరావతిలోనే రాజధాని ఉండాలని, కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజానాథ్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు
  • 21-09-2020న సీతారాం ఏచూరి : అమరావతి ఐకాస నేతలు చెప్పిన అంశాలు పరిశీలిస్తాం. అమరావతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం. మూడు రాజధానుల విధానం ఎక్కడా సాధ్యం కాలేదు. సాధ్యం కాని మూడు రాజధానుల విధానం అనవసరం. అమరావతిని రాజధానిగా పరిరక్షించాలి.
  • 21-09-2020 డి.రాజా : సీపీఐ ప్రధాన కార్యదర్శి అమరావతి కోసం రైతులు, ప్రజలు నిరంతరాయంగా పోరాడుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఏపీకి మంచిది కాదు. అమరావతి ఐకాసతో కలిసి సీపీఐ కూడా పోరాడుతుంది. అమరావతికి మా పూర్తి మద్దతు ఉంది. ప్రత్యేక హోదా విషయంలోనూ కట్టుబడి ఉన్నాం
  • 21-09-2020 ఏఐసీసీ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ : అమరావతి రైతుల ఇబ్బందులు బాధాకరం. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. భూములు త్యాగాలు చేసిన రైతులను మోసం చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాం.
  • 22-09-2020 శివసేన ఎంపీ అరవింద్ సావంత్: రైతుల త్యాగాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఉమ్మడి ఏపీ విభజన నాటి నుంచే ఏపీకి న్యాయం జరగాలని శివసేన కోరుతోంది. కేంద్రం జోక్యం చేసుకుని రాజధాని రైతులకు న్యాయం చేయాలి.
  • 23-09-2020 కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రభుత్వం కార్యాలయాల తరలింపును చేపట్టింది. ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ కార్యాలయాన్ని విజయవాడ నుండి విశాఖపట్నం తరలింపు. విజయవాడలో ఉన్న కార్యాలయంలోని ఫైల్స్, ఇతర సామాగ్రిని అధికారులు ట్రాన్స్ ఫోర్ట్ ద్వారా అధికారులు తరలించారు.
  • 23-09-2020 రాష్ట్ర ప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై జనసేన హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్‌ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. జనసేన ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
  • 24-09-2020 కేంద్రమంత్రి రాందాస్ అథవాలే: రాజధాని విషయంలో రైతుల డిమాండ్ న్యాయమైంది - రాజధానిగా అమరావతికి నా మద్దతు ఉంటుంది - రాజధాని అంశంపై సీఎం జగన్‍కు లేఖ రాస్తా - పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారు.
  • 01-10-2020 రాజధానిగా అమరావతే ఉండాలని సీపీఐ తమ వైఖరి స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాకలు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరపున హైకోర్టు న్యాయ వాదలు చలసాని అజయ్ కుమార్, చలసాని వెంకట్ హైకోర్టులో అఫిడవిట్ వేశారు.
  • 02-10-2020 డిల్లీలోని గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన అమరావతి ఐకాస సమితి నేతలు.
  • 02-10-2020 రాజధానిలో వై.యస్. విజయమ్మ గోప్యంగా పర్యటన. ఒక ఎస్కార్ట్ వాహనంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మీదగా సచివాలయం వద్దకు చేరుకుని అసెంబ్లీ, సచివాలయం భవనాల్నీ చూశారు. అనంతరం ప్రభుత్వ పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల భవనాలను చూస్తూ హైకోర్టు వరకు వెళ్లారు. కారులోంచి దిగకుండా లోపల నుండే పరిశీలించారు.
    21-09-2020 రోజు వారీ విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం..అప్పటి వరకు స్టేటస్ కో పొడిగించిన హైకోర్టు. అక్టోబర్ 5 నుండి రోజువారీ విచారణ ప్రారంభం.
  • 05-10-2020 - 5.10.2020 నుండి రాజధానితో ముడిపడిన వ్యాజ్యాల్లో దాఖలైన అనుబంధ పిటిషన్లపై రోజు వారీ విచారణ చేపట్టాలని అక్టోబర్5న హైకోర్టు నిర్ణయిచిందింది. జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధాని పిటిషన్లపై అక్బోబర్ 5 2020న నిర్ణయించింది. ప్రధాన వ్యాజ్యాలకు అనుబంధంగా మొత్తం 229 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 183 అనుబంధ పిటిషన్లు రాజధాని తరలింపుపై స్టే ఉత్తర్వులు కోసం దాఖలు చేసినవి కాగా, 44 ఇతర అంశాలకు చెందినవి, 2 స్టే ఎత్తివేత అభ్యర్థనకు వేసిన పిటిషన్లు.
  • 06-10-2020 మూడు రాజధానుల తరలింపు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. క్యాంపుల కార్యాలయాలు ఎక్కడైనా ఉండొచ్చాని ఏజీ శ్రీరాం తెలిపారు. అవసరం లేకుండా నిర్మించిన దాన్ని క్యాంపు కార్యాలయం అనాలా అని ప్రశ్నించిన హైకోర్టు. క్యాంపు కార్యాలయ ఏర్పాటు సంబంధించిన నిబందన సీఆర్డీఏ చట్టంలో ఉందా అని ప్రశ్నించిన కోర్టు.‘‘ప్రభుత్వం తరపును ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8లో ఎక్కడైతే సీఎం ఉండి పనిచేస్తారో అదే క్యాంపు కార్యాలయం అని అన్నారు. రాజధాని పరిధిలోనే క్యాంపు కార్యాలయం ఉండాలనేమీ లేదన్నారు. స్టేట్ కార్పోరేషన్లు అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. గత సీఎం సొంతగ్రామంలో (చంద్రబాబు నారావారిపల్లెలో), హైదరాబాద్ లో క్యాంపు కార్యాలయాలున్నాయన్నాయి’’ అని ఏజీ అన్నారు. క్యాంపు కార్యాలయాల ఏర్పాటుపై పూర్తి స్థాయి అఫిడవిట్ ను అక్బోబర్ 9న అందజేస్తామని తెలిపారు అయితే. విశాఖ గెస్ట్ హౌస్ పై విచారణను 9కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయించింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని పేర్కొంది.
  • సీల్డ్ కవర్లో ఫైళ్లు ఇవ్వండి : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఫైళ్లను కోర్టు పరిశీలించేందుకు సీల్డ్ కవర్లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఫైళ్లలో గోప్యత లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టు ముందుంచుతామని ఏజీ శ్రీరాం తెలిపారు.
  • 06-10-2020 రాజధాని పేదలకు పింఛన్ల మంజూరు. నిరుపేద కుటుంబాలకు ఇచ్చే పింఛన్ల నిమిత్తం రూ.16.25 కోట్లు మంజూరు. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికానికి పింఛన్లు ఇస్తున్నట్లు ప్రకటన.
  • 07-10-2020 రాజధాని వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర అర్థ, గణాంకాల డైరెక్టరేట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం రూ.వేల కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వం అర్థంతరంగా నిలిపేసిందని, ఈ కారణంగా ఖజానాకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, ఆ ప్రభావం వివరాలు తెలసుకునేందుకు ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ ను ప్రతివాదిగా చేర్చాలని రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది.
  • సీఆర్డీఏతో ప్రాంతీయ అసమానతలు : శివరామకృష్ణ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, కేవలం రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించిందని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రతినిధుల తరపు న్యాయ వాదులు సీహెచ్ శివారెడ్డి, నాగిరెడ్డి తదితరులు హైకోర్టుకు వివరించారు. సీఆర్డీఏ చట్టంతో రాస్ట్రం సమగ్రాభివృద్ధి జరగదని, దీని వల్ల ప్రాంతీయ అసమానతలు నెలకొంటాయన్నారు. అందుకే సీర్డీఏ చట్టాన్ని రద్దు చేసి మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. తమ వాదనలు వినేందుకు ప్రతివాదులుగా చేర్చాలని అభ్యర్థించారు.
  • 08-10-2020 అమరావతి రాజధానిపై హైకోర్టులో జరిగిన వాదనలు. ఆర్థిక, గణాంక శాఖలకు హైకోర్టు నీటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై నివేదిక ఇవ్వాలని ఆర్థిక, గణాంక శాఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపై మరి కొన్ని వ్యాఖ్యాలు అక్టోబర్ 12కు వాయిదా వేసింది.
  • 09-10-2020 రాజధాని భూముల విషయంలో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎలాంటి కథనాలు వెలువరించరాదని గత నెల 15వ తేదీన తాము ఆదేశాలిచ్చాన మల్లీ ఎందుకు పోస్టులు పెడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు లోబడి తగిన చర్యుల తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తామని పేర్కొంది. రాజధాని భూములు విషయంలో ఏసీ నమోదు చేసిన కేసులో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ న్యాయవాది మమతారాణి అనుబంద పిటిషన్ ఇదివరకే దాఖలు చేశారు. దీనిప 09-10-2020న విచారణ జరిగింది. దీనిపై దమ్మాల పాటి శ్నీనివాస్ తరపున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ తాము అనుబంధ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేశామని తెలిపారు. ఏసీబీ నమోదు చేసిన కేసు వివరాలు బయటకు రాకూడదని కోర్టు ఆదేశాలిచ్చినా ఫేస్ బుక్ కలో పరువుకు బంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తామని మరింత సమయం కావాలని ప్రణతి కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణ తదుపరి వారానికి వాయిదా వేశారు.
  • 11-10-2020 హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు : సీఎం క్యాంపు కార్యాలయం ఓ చోటనే ఉండాలనడం చట్ట బద్ధం కాదని, ప్రతి జిల్లాలోనూ దానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్లో దాఖలు చేసింది. ఏపీ సీఆర్డీఏ చట్టంలోగానీ, ఈ చట్టం కింద నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ లో గానీ సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించిన నిర్వచనం, ప్రస్తావన లేవంది. ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుండి మాత్రమే ముఖ్యమంత్రి పని చేయాలని ఇతర జిల్లాల్లో అలాంటి వసతి ఉండకూడదని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదంది. సీఎం క్యాంపు కార్యాలయం తరలిపోకుండా అడ్డుకోవాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ కొట్టేయాలని కోరింది. రాజధాని నుండి రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయం, పోలీసు ప్రధాన కార్యాలయాలు విశాఖకు తరలిపోకుండా అడ్డుకోవాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి అనుబంధ పిటిషన్ ఇది వరకే దాఖలు చేసింది. ఈ అంశంపై 12/11/2020కి వాయిదా వేసింది.
  • 12-10-2020 రాజధాని ఉద్యమం 300 రోజులు పూర్తికావడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాస్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులకు సంఘీభావంగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు.
  • 12-10-2020 రాజధాని అంశాలకు సంబంధించిన ప్రధాన పిటిషన్లపై నవంబర్ 2వ తేదీ నుండి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర శాసనమండలిలో జరిగిన పరిణామాలను పరిశీలించేందుకు అనువుగా వీడియో పుటేజీని సీల్డ్ కవర్ లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఆ తుది విచారణ ద్వారా భౌతిక లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపడతామని పేర్కొంది.
  • 22-10-2020 ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపనకు చేసి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పూజించిన రైతులు. పోటీగా మూడు రాజధానులంటూ మంగళగిరి, తాడేపల్లి నుండి కొందరికి కూలీలిచ్చి ఆటోలో తీసుకెళ్లి ఆందోళనలు చేయించిన వైసీపీ. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రైతులను రెచ్చగొడుతున్నారంటూ రైతుల ఆగ్రహం. వెంటబెట్టుకుని కొందరిని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చిన పోలీసులు.
  • 27-10-2020 రాజధాని పరిధిలో లేని గ్రామాల నుండి మందడం తీసుకువచ్చి పోటీ ధర్నాలు చేయించిన వైసీపీ. ఆటోలో వస్తున్న వారిని ఎక్కడి నుండి వస్తున్నారో చెప్పాలని అడిగిన రైతులు. పెయిడ్ ఆర్టిస్టులను ప్రశ్నించినందుకు 11 మంది రైతుల అరెస్టు. ఏడుమంది రైతులకు బేడీలు వేసి గుంటూరు సబ్ జైలుకు తరలించిన పోలీసులు.
  • 28-10-2020 రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందో అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం సేకరించి అమరావతి చుట్టుపక్కల భూములు కొన్నారనే ఆరోపణతో మంగళగిరి సీఐడీ పోలీసుల పలువురిపై నమోదు చేసిన కేసులో నవంబర్ 2 వరకు తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేస్తూ విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. రాజధానిగా అమరావతిని నిర్ణయించకముందే చుట్టుపక్కల పలువురు భూములు కొనుగోలు చేశారని పేర్కొంటూ వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేష్ ( వైసీపీ కార్యకర్త) సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కె.శ్రీహాస, కె.రాజేష్, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వి, లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు.
  • 30-10-2020 రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
  • 31-10-2020 రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ చలో గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, జేఏసీ నేతలు, వివిధ పార్టీ నాయకులు గృహనిర్భంధం. పోలీసుల ఆంక్షలను చేధించి గుంటూరు జిల్లా జైలు ముట్టడికి యత్నించిన మహిళలు. మహిళల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించిన పోలీసులు.
  • 1-11-2020 మహిళల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సంపూర్ణ బంద్
  • 2-11-2020 మూడు రాజధానుల ఏర్పాటు అంశం అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే అవుతుందని రాజధాని పరిరక్షణ సమితి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ స్పష్టం చేశారు. భూసమీకరణ( ల్యాండ్ పూలింగ్) పథకం చట్టబద్దమైనది. దానిని విస్మరించడానికి వీల్లేదు. భూములు తీసుకునే టప్పుడు నిర్ధిష్ట సమయంలో రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ఆ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రపంచస్థాయి రాజధాని నగరం అమరావతి ఏర్పాటు కానుందని విశ్వసించి 29,771 మంది రైతులు 33,771 ఎకరాలను త్యాగం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు గల ప్రత్యేక కారణాలను రాష్ట్ర ప్రభుత్వం చూపలేకపోయింది. విభజన చట్టం ప్రకారం 94(3) ప్రకారం కొత్తగా ఏర్పడే ఏపీ రాజధాని పరిదిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు తదితర విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. విభజన చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది తప్ప 3 రాజధానుల గురించి లేదు అని శ్యాం దివాన్ వాదించారు. విచారణను 3-11-2020కు వాయిదా వేసింది.
    ఇంప్లీడ్ పిటిషన్లు కొట్టివేత : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమను ప్రతివాదులుగా చేర్చుకుని (ఇంప్లీడ్) వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన కొందరు వేసిన అనుబంధ పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. విశాఖలో నిర్మిస్తున్న అతిధి గృహానికి చెందిన మాస్టర్ ప్లాన్ ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటి పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది.
  • 3-11-2020 మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితం.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు న్యాయవాది శ్యాం దివాన్ హైకోర్టు వాదనలు వినిపించారు. ‘‘రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని మళ్లీ మార్చడం కుదరదు. దాని వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. భూ సమీకరణలో రైతులు తమ జీవనాధారమైన భూముల్ని ఇచ్చారని, వారి ప్రాథమిక హక్కులను హరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు పార్లమెంటు చట్టం చేసింది. ఆ తర్వాతి పరిణామాల్లో ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి నిర్ణయించారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ఆర్థికసాయం చేసింది. రాజధానిని నిర్ణయించిన చోటే కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించాలి. వేరే ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తామంటే కుదరదు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం సరికాదు. అప్పటి ప్రభుత్వం చట్టసభల్లో చర్చించి అమరావతి ఒక్కటే రాజధానిగా నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలోనూ ఒక రాజధాని అనే ఉంది. ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు విబజన చట్టం ఆధారంగా కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకే విలువ, చట్టబద్ధత ఉంటాయి. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ఉండదు. అమరావతి రాజధానిగా ప్రణాళిక సిద్ధమైంది. ప్రజాధనంతో మౌళిక సదుపాయాలతో రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ దశలో రాజధానిని మార్చడం సరికాదు. రాజధానిని మారిస్తే అధికరణ 21,300(ఏ) ప్రకారం భూములిచ్చిన రైతుల హక్కులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. రాజధాని అమరావతి ప్రాజెక్టును అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల రూ.33 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది అని దివాస్ పేర్కొన్నారు. తదుపరి విచారణకు హైకోర్టు 04/11/2020కు వాయిదా వేసింది.
  • 4-11-2020 అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని హైకోర్టులో సీపీఎం అఫిడవిట్ దాఖలు. అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలమని..రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకమని వెల్లడి.
  • 8-11-2020 రాజధానిలో దళిత రైతులకు సంకెళ్లు వేయడంతో పాటు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు జాతీయ హక్కుల మానవ కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ) ఆదేశాలు.
  • 11-11-2020 అక్టోబర్ 12, 2020న అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తైన సందర్భంగా విజయవాడలో ర్యాలీ నిర్వహిస్తే 11-11-2020న జేఏసీ నేతలపై పోలీసులు కేసు నమోదు. ఐపీసీ 188, 269, 341 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు.
  • 11-11-2020 వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది. ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎస్సీలపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లదు. వారిపై పెట్టిన మిగిలిన సెక్షన్లన్నీ బెయిల్ ఇవ్వదగినవే. అలాంటప్పుడు నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. ఏడుగురు రాజధాని రైతులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత.
  • 12-11-2020 అక్బోబర్ 23న తాళ్లాయపాలెం వెళ్తున్న పెయిడ్ ఆర్టిస్టులను ప్రశ్నించినందుకు అరెస్టు అయిన ఏడుగురు రైతులు విడుదల.
  • 18-11-2020 అమరావతే రాజధానిగా ఉంటుందని, జనసేన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని అమరావతి జేఏసీతో చెప్పిన పవన్ కళ్యాన్.
  • 11.12.2020 ఉద్దండరాయునిపాలెంలో దీక్ష చేస్తున్న రైతులపై రాళ్లదాడి చేసిన వారిని కాకుండా ప్రశ్నించినందుకు 21 మంది రైతులపై అట్రాసిటీ కేసలు నమోదు.
  • 17.12.2020 రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం ఏడాది పూర్తి కావడంతో రాయపూడిలో రైతులు ఏర్పాటు చేసిన రణభేరి సభకు వైసీపీ, సీపీఎం మినహా అన్ని పార్టీలు హాజరు. రైతుల పోరాటం, అమరావతి ప్రాధాన్యతను వివరించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, తులసిరెడ్డి, సీపీఐ రామకృష్ణ, ఇతర పార్టీ నేతలు.
  • 19.01.2021 రాజధాని భూముల్లో ఇన్‍సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు. కిలారు రాజేష్‍తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని పేర్కొన్న ప్రభుత్వం. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని క్వాష్ పిటిషన్ వేసిన కిలారు రాజేష్. అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని వాదించిన పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు. ఇన్‍సైడర్ ట్రేడింగ్ లేదని పేర్కొన్న హైకోర్టు. ఇన్‍సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని స్పష్టం చేసిన జస్టిస్ మానవేంద్రరాయ్.
  • 12.02.2021 శాసన రాజధానికి అవసరమైన భవనాలపై కమిటీ సమావేశం. శాసనరాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చ. సీఎస్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీ వేసిన ప్రభుత్వం. రాజధానిలో అసంపూర్తి భవనాలకు అవసరమైన నిధులపై సమీక్ష. భవనాల పూర్తి అంశంపై కమిటీకి నివేదించిన ఎమ్మార్డీఏ అధికారులు. అసంపూర్తి భవనాలకు రూ.2,154 కోట్లు అవసరమని అంచనా. కాంట్రాక్టర్ల చెల్లింపులకు రూ.300 కోట్లు అవసరమని కమిటీ అంచనా. బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీకావాలని ఎమ్మార్డీఏకు కమిటీ ఆదేశం. అసంపూర్తి నిర్మాణాలు, నిధుల సమీకరణపై భేటీకావాలని ఆదేశం. 70 శాతంపైగా పూర్తైన భవనాలు పూర్తిచేయాలని కమిటీ అభిప్రాయం. మార్చి రెండో వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయం. 288 ఫ్లాట్లలో 74 శాతం పూర్తయినట్టు పేర్కొన్న ఏఎంఆర్డీఏ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల్లో చేపట్టాల్సిన 288 ఫ్లాట్లు. 144 ఫ్లాట్లల్లో 74 శాతం మేర నిర్మాణాలు పూర్తి చేసినట్టు వెల్లడి. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల్లో చేపట్టాల్సిన 144 ఫ్లాట్లు. ఎన్జీవో హౌసింగ్‍లోని 1,968 ఫ్లాట్లలో 62 శాతం పూర్తయినట్లు స్పష్టం.
  • 15.02.2021 విశాఖ ఉక్కుఉద్యమానికి సంఘీభావంగా విశాఖ బయలుదేరిన అమరావతి రైతులు. పల్లా శ్రీనివాసరావు చేస్తున్న దీక్షలో పాల్గొన్న రైతులు.
  • 09.03.2021 గుడికి వెళ్తున్న రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని ప్రశ్నించి, తోపులాట జరిగిన సందర్భంగా మహిళలపై 143, 188, 322, 353, 506, 509 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు.
  • 18.03.2021 అమరావతి భూముల వ్యవహరంలో చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై స్టే ఇచ్చిన హైకోర్టు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు.
  • 20.03.2021 అమరావతి అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు, నారాయణలపై సీఐడీ విచారణకు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీఐడీ నిర్ణయం.
  • 16.07.2021 రాజధాని ఎక్కడ వస్తుందో ప్రజలకు అవగాహన వుంది. భూ క్రయ విక్రయాలు జరిగిన 6-7 ఏళ్ల తర్వాత క్రిమనల్ కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దాని ఉత్తర్వుల్లో తప్పేముంది. భూములు విక్రయించిన వారు ఏదైనా చెబితే తప్ప సివిల్ లయబిలిటీ ఉందో లేదో రుజువు చేయలేం. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అంశాలనూ హైకోర్టు అద్యయనం చేసిందన్న సుప్రీం కోర్టు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా.
  • 30.07.2021 సుప్రీంకోర్టులో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం.
  • 02.09.2021 మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్‍సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు. గతంలో ఈ కేసులో స్టే ఉండడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఏపీ ప్రభుత్వం. నెల రోజుల్లో కేసును తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. జస్టిస్ మానవేంద్రనాథ్‍రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టేసిన హైకోర్టు. ఎఫ్‍ఐఆర్‍ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు.
  • 13.09.2021 హైకోర్టులో రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో 316పై స్టేటస్ కో ఇచ్చిన ఏపీ హైకోర్టు. జీవో 316ను హైకోర్టులో సవాల్ చేసిన న్యాయవాది ఇంద్రనీల్‍బాబు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‍లను రద్దు చేసేందుకు జోవో ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన లాయర్ ఇంద్రనీల్. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో విధించిన ఏపీ హైకోర్టు. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు ఏపీ హైకోర్టు ఆదేశం
  • 01.11.2021 న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులు.
  • 16.11.2021 రాజధాని అమరావతి కోసం 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని.. అమరావతి రైతుల రాజధానే కాదని.. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి.. విశాఖ, కర్నూలుతో సహా అందరిది అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా సీజే ప్రస్తావించారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ కోసమే పోరాడలేదని.. దేశ ప్రజలందరి కోసం పోరాడారని గుర్తుచేశారు.
  • 22-11-2021 అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు బిల్లు తీసుకొస్తున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ ప్రకటన. వివరాలు సమర్పించాలని ఆదేశించిన కోర్టు.
  • 22-11-2021 అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
    1) రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది.
    2) గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.
    3) అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు... వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, మన ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు, ఈప్రభుత్వాన్ని.
    4) అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదననుకూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం.
    5) ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది.
    6. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.
  • Feb 4, 2022 మూడు రాజధానులపై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు
    మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ముగిసింది. బిల్లులు ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత విచారణపై వాదనలు జరిగాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాజధాని వ్యవహారంలో జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను రద్దు చేయాలని రైతులు, ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అమరావతిని ధ్వంసం చేయాలని ముందుగా సిద్ధం చేసిన నివేదికలను జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు సమర్పించాయన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా అవి ఉన్నాయన్నారు. ‘భూములిచ్చిన రైతుల, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. రాజధాని మార్పునకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆ మేరకు ఉత్తర్వులివ్వాలి’ అని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి నాలుగో తేదీన ఆదేశాలిచ్చింది.
    మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో రాజధాని అమరావతి విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థనలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలాంటి ఉత్తర్వులివ్వాలనే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం, సీఆర్‌డీఏ, శాసనమండలి తరఫు న్యాయవాదులు గత విచారణలో వాదనలు వినిపించారు. వాటికి సమాధానంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
  • మార్చి 3, 2022: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తిచేయాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది.
Last Updated : Mar 3, 2022, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details