తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 5:01 AM IST

Updated : Aug 8, 2021, 9:45 AM IST

ETV Bharat / city

Amaravathi: అమరావతి ఉద్యమం.. 600 రోజుల సుదీర్ఘ పోరాటం

ఒకటి కాదు, రెండు కాదు.. 600 రోజుల సుదీర్ఘ పోరాటమది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమం అది. ఊరూవాడా ఏకమై.. కనిపించిన ఏ మార్గాన్నీ వదులుకోకుండా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనీయకుండా రాజధాని కోసం గళమెత్తుతూనే ఉన్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకు తమ ఆకాంక్షను వినిపిస్తూనే ఉన్నారు. లాఠీలు విరిగినా, నెత్తురోడినా, పోరాటపటిమను ఏనాడు సడలనివ్వలేదు. అక్రమ కేసులు పెట్టినా, కరోనా ప్రాణం భయం వెంటాడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా సుదీర్ఘంగా వారు చేస్తున్న పోరాటం నేటితో 600వ రోజుకు చేరుకుంది.

Amaravathi
అమరావతి ఉద్యమం.

  • అక్కడి అందరి ఆశ, శ్వాస ఒక్కటే అమరావతిని కాపాడుకోవటం..
  • కులమతాలతీతంగా అందరి లక్ష్యం ఒక్కటే రాజధాని తరలిపోకుండా అడ్డుకోవటం..
  • రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ప్రజలు సహా విపక్ష రాజకీయ పార్టీలు, సంఘాల అలుపెరగని పోరాటం మొదలై నేటితో 550 రోజులు..
  • 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి 3 రాజధానుల ఆలోచన బయటపెట్టిన మరుసటిరోజు నుంచే రాజధాని రైతుల పోరుబాట

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూసమీకరణలో భాగంగా ఇచ్చారు. వారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే. ప్రభుత్వం మారినా.. రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో.. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ఆలోచన శరాఘాతంలా మారింది. ఆ మర్నాటి నుంచే రాజధానిలో ఉద్యమం ఊపిరిలూదుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై.. క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి అధికార వైకాపా తప్ప, మిగతా అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు, రైతు నాయకులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.

తేదీలవారీగా ఉద్యమంలో కొన్ని ముఖ్య ఘట్టాలు..

  • 17.12.2019- ముఖ్యమంత్రి జగన్‌ శాశనసభలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటన
  • 18.12.2019- రాజధాని ఉద్యమం మెుదలు
  • 19.12.2020- అమరావతిలో రైతుల బంద్..144 సెక్షన్ అమలు
  • 29.12.2019- 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు
  • 03.01.2020- రాజధాని మహిళలపై పోలీసుల దాడి..నిరసనగా అమరావతి బంద్.. ఎన్‌హెచ్‌ఆర్సీకి తెదేపా ఫిర్యాదు
  • 03.01.2020- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్‌, గవర్నర్‌, సీఎం, అన్ని హెచ్‌వోడీల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.

బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ బోగస్ అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆక్షేపణ.

  • 09.01.2020- బెజవాడలో చంద్రబాబు బైఠాయింపు..బస్సుయాత్రకు పోలీసుల అడ్డంకులు..ప్రారంభించి తీరుతామన్న చంద్రబాబు..బెంజి సర్కిల్​లో రోడ్డుపైనే నిరసన..అదుపులోకి తీసుకున్న పోలీసులు..వాహనాన్ని కదలనీయని జనం.. మూడున్నర గంటలపాటు ఉత్కంఠ.
  • 12.01.2020- రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నారైలు డిమాండ్‌ చేశారు. సేవ్‌ అమరావతి-సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కానీ అధికార వికేంద్రీకరణ కాదని నినాదాలు.
  • 13.01.2020- ఈనాడు కథనాల్ని ఫోటోలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు న్యాయస్థానం.
  • 20-03.2020- రాష్ట్రంలో కరోనా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు. ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ప్రతి ఒక్కరు మరొకరితో 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉద్యమంలో పాల్గొంటారని నేతల స్పష్టీకరణ.
  • 25.03.2020- నాటికి 100వ రోజుకు చేరుకున్న ఉద్యమం.

100వ రోజు వరకు ముఖ్య ఘట్టాలు

  • మొదట్లో రోడ్లపైనే నిరసన తెలియజేశారు. క్రమంగా పలుచోట్ల రోడ్ల మీదే వంటావార్పు చేపట్టి రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామ సచివాలయాలకు నల్లరంగు పూసి నిరసన తెలిపారు.
  • రోడ్లపై నిరసనలు తెలియజేయకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రైవేటు స్థలాల్లో శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగించారు.
  • విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకుని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాదయాత్రగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
  • మందడంలోని నిరసన శిబిరంలో దీక్ష చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు మహిళలపై దాడి చేయడంతో, ఒక మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో పోలీసుల వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • జాతీయ మహిళా కమిషన్‌ బృందం రాజధాని గ్రామాలు, గుంటూరు, విజయవాడ నగరంలో పర్యటించి బాధితుల నుంచి వినతులు స్వీకరించింది.
  • రాజధాని రైతులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దాదాపుగా అసెంబ్లీ వరకు చేరుకున్నారు. రైతులతో పాటు ముట్టడిలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేశారు. మహిళలు, రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బంద్‌ పాటించారు.

04.07.2020-నాటికి 200వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం

23.08.2020- నాటికి 250వ రోజుకు చేరుకున్న రైతుల నిరసనలు

ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు దీక్షకు కూర్చున్నారు. 251వ రోజు మొదలు 50 రోజులపాటు దీక్ష చేయాలని నిర్ణయించారు.

300 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం

  • 12.10.2020-నాటికి 300 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం
  • ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో రాజధాని గ్రామాల రైతులు ‘ఆత్మ బలిదాన యాత్ర’ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన 92 మంది రైతులు, రైతుకూలీల చిత్రాలు ఉంచిన పాడెలను మోస్తూ దీక్షా శిబిరం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ పాదయాత్రగా వెళ్లారు.

మంత్రుల వేషధారులకు ఉరి!

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, అప్పలరాజు వ్యాఖ్యల్ని నిరసిస్తూ మందడంలో రైతులు వినూత్న నిరసన తెలిపారు. మంత్రుల వేషధారణలో ఉన్న వ్యక్తులకు ఉరి బిగిస్తూ నిరసన ప్రకటించారు.

ఉద్యమ గీతానికి దివ్యవాణి నృత్యం

ప్రజానాట్యమండలి గాయకుడు రమణ బృందం ఆధ్వర్యంలో దీక్షా శిబిరాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. తుళ్లూరులో తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఉద్యమకారులతో కలిసి నృత్యం చేశారు.

రైతుల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో సభ ముగించుకున్న తెదేపా నేత లోకేశ్‌ వెంకటపాలెం బయలుదేరారు. ఆయన కాన్వాయ్‌ వెంట రైతులు ప్రదర్శనగా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

  • 21.10.2020-రాజధానికి శంకుస్థాపన జరిగి నాటితో ఐదేళ్లు పూర్తి. గుంటూరు నుంచి అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వరకూ ‘మహా పాదయాత్ర’.
  • మూడు రాజధానుల ఉద్యమం కోసం తరలివెళుతున్న ఆటోలను మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అడ్డుకున్న ఘటనలో 11 మంది దళిత, బీసీ రైతులను మంగళగిరి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.
  • 31.10.2020-రాజధాని అమరావతి రైతులు చేపట్టిన ‘చలో గుంటూరు జైలు’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల నడుమ విజయవంతమైంది. ఎస్సీ రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాక..వారి చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు.
  • 06.12.2020-రాజధాని ఎక్కడుందో తెలియని అయోమయంలో దిక్కుతోచకుండా రాష్ట్రం నిలబడి ఉంది. ఎందుకీ దుస్థితి? ఎవరిదీ ఈ నేరం?’ అని ప్రశ్నిస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ ‘రాజధాని విషాదం- అమరావతి’ పేరిట 60 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ రూపొందించారు.
  • 13.02.2021-అమరావతిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు పూర్తి చేయాలంటే రూ.2,154 కోట్లు అవసరమని..ఇప్పటికే 70 శాతం నిర్మించినవాటి మీద రూ.300 కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయిపోతాయని పురపాలక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన 9 మంది కమిటీకి నివేదించారు.
  • 12.02.2021-అమరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో నిలిపివేసిన భవనాలు, నివాస గృహాల్ని (హౌసింగ్‌ యూనిట్స్‌) ఏం చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తోంది. వాటిలో శాసన రాజధానికి తప్పనిసరిగా కావాల్సిన భవనాలేవో గుర్తించేందుకు ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో ఏడుగురు సభ్యులుగా ఉంటారు.
  • 19.03.2021-దేశంలో కొత్త నగరాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం 8 రాష్ట్రాలకు కలిపి 8 వేల కోట్లు సిఫార్సు చేసిందని, ఈ రాష్ట్రాలకు అయిదేళ్లలో రూ.వెయ్యి కోట్లు చొప్పున నిధులు అందుబాటులో ఉంటాయని మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ లోక్‌సభలో ప్రకటించారు.
  • 25.03.2021-అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు,భూ సమీకరణ పథకం లే అవుట్ల అభివృద్ధి పనులకు తొలి దశలో రూ.3 వేల కోట్లు రుణం తీసుకునేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
  • 27.03.2021-రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ మే 3కు వాయిదా పడింది. విచారణను ఓసారి ప్రారంభించాక వరుసగా నిర్వహిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
  • 01.04.2021-రాష్ట్ర హైకోర్టు తరలింపు అంశం తమ పరిధిలోనిది కాదని.. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. హైకోర్టును అమరావతి నుంచి తరలించడంపై ఆర్టీఐ కార్యకర్త ఎం.సాంబశివరావు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి కేంద్ర న్యాయశాఖ సమాధానమిచ్చింది.
  • 18.04.2021-మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ ఇంకెంత మంది అన్నదాతల్ని బలి తీసుకుంటారని అమరావతి రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గ నిర్ణయానికి మనోవేదన చెంది అమరావతిలో 150 మంది రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
  • 31-04-2021- నాటికి 500వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం

రాజధాని నిర్మాణానికి సుమారు 29,800 మంది రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూసమీకరణలో ప్రభుత్వానికి భూములిచ్చారు. వారిలో ఎకరం లోపు భూమి ఉన్నవారు 20 వేల మంది ఉన్నారు. ఎకరం నుంచి ఐదెకరాల వరకున్న వారు మరో 8,500 మంది ఉన్నారు. ప్రభుత్వం మెట్ట భూములకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున కౌలు నిర్ణయించింది. ఏటా పది శాతం పెంచుతోంది. సాగు కోసం చేసిన అప్పులున్నా భూమి చేతిలో ఉందన్న భరోసాతో రైతులు జీవించేవారు. ఇప్పుడు సాగు చేద్దామంటే భూమిలేదు. ప్రభుత్వం భూమి తీసుకొని ఏడేళ్లవుతోంది. మూడేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. వాటిని అభివృద్ధి చేయకపోయినా,ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను ఎవరికైనా ఎంతో కొంతకు అమ్ముదామంటే 3 రాజధానుల ప్రకటన తర్వాత కొనేవాళ్లు లేరు. అప్పటినుంచి తమ పరిస్థతి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలి, ఏకకై రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు తమ పోరాటం ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

భూమి లేక.. సాగూ లేక

రాజధాని నిర్మాణానికి సుమారు 28,800 మంది రైతులు 84 వేల ఎకరాలకుపైగా భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది ఉన్నారు. ఎకరం నుంచి ఐదెకరాల వరకున్న వారు మరో 8,500 మంది ఉన్నారు. ప్రభుత్వం మెట్ట భూములకు ఎకరాకు రూ.80 వేలు, జరీబు భూమి ఎకరాకు రూ.50 వేల చొప్పున కౌలు నిర్ణయించింది. ఏటా పది శాతం పెంచుతోంది. సాగు కోసం చేసిన అప్పులున్నా భూమి చేతిలో ఉందన్న భరోసాతో జీవించేవారు. ఇప్పుడు సాగు చేద్దామంటే భూమి లేదు. ప్రభుత్వం భూమి తీసుకొని ఏడేళ్లవుతోంది. మూడేళ్లలో ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. వాటిని అభివృద్ధి చేయకపోయినా, ప్రభుత్వం తమకు కేటాయించిన ఫ్లాట్‌ను ఎవరికైనా ఎంతో కొంతకు అమ్ముదామంటే 3 రాజధానుల ప్రకటన తర్వాత కొనేవాళ్లు లేరు.

600 రోజులకు చేరిన రాజధాని రైతుల నిరసనలు.. 08.08.2021

  • 'ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అమరావతి” పేరుతో ప్రచురించిన 88 పేజీల పుస్తకంలో రాజధానికి శంకుస్థాపన చేసింది మొదలు, అమరావతి పరిరక్షణ ఉద్యమం, మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం, దాడులవంటి పరిణామాలన్నిటినీ పొందుపరిచారు. పుస్తకాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఏపీ పరిరక్షణ సమితి ఛైర్మన్‌ బి.సూర్యనారాయణ ప్రచురించారు.
  • రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి.. బదులుగా సీఆర్‌డీఏ నుంచి స్థలాలు తీసుకున్న కేటగిరీ (4) అస్సైన్స్‌ రైతులు కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
  • అమరావతిలో రహదారుల తవ్వకాలు, ఇసుక మట్టి తరలింపు ఘటనలు ఆగడం లేదు.
  • కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన 5 గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కూడా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ 28.07.2021 న రాజ్యసభలో తెలిపారు.

సంబంధిత కథనాలు..

వైకాపా దిగిపోయేంత వరకు ఉద్యమం చేస్తాం: అమరావతి రైతులు

సమరావతి@ ఉద్యమపథంలో 400వ రోజు

365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం..

అమరావతి పరిరక్షణ కోసం 'మహా పాదయాత్ర'

Last Updated : Aug 8, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details