తెలంగాణ

telangana

ETV Bharat / city

"రేవంత్​ నా ముద్దుల అన్నయ్యే కానీ.. 'ఏబీసీడీ'లు బాధించాయి" - RAVANTH ON URANIUM

ఎంపీ రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యురేనియంపై తనకు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్​ అనడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. రేవంత్​రెడ్డిలా అవగాహన లేకుండా తాను మాట్లాడడని అందరికీ తెలుసని చెప్పారు.

రేవంత్​ నా ముద్దుల అన్నయ్యే కానీ..  'ఏబీసీడీ'లు బాధించాయి

By

Published : Sep 20, 2019, 7:40 PM IST

రేవంత్​ నా ముద్దుల అన్నయ్యే కానీ.. 'ఏబీసీడీ'లు బాధించాయి

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ 'తన ముద్దుల అన్నయ్య' అని అంటూనే ఆయన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. యురేనియంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు చెప్పిన పార్టీ స్టాండ్ తప్పని అభిప్రాయపడ్డారు.

ఆయనకు యురేనియం ఊసెందుకు...

యురేనియంపై సంపత్​కు ఏబీసీడీలు తెలియవని రేవంత్​రెడ్డి అనడం సరికాదన్నారు. కార్యవర్గ సమావేశంలో తాను ఏం మాట్లాడానో తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి స్పందించి ఉంటే బాగుండేదన్నారు. రేవంత్​లా అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని, ఆధారాలు లేకుండా తానేం మాట్లాడనని అందరికీ తెలుసని చెప్పారు. సంపత్, వంశీలకు యురేనియం సమావేశంలో ఏంపని అని రేవంత్ అన్నారని.. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్​కు యురేనియంపై ఏంపని.. అంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

పవన్​కల్యాణ్​తో సెల్ఫీలా..

గతంలో యురేనియంపై దిల్లీలో అటవీశాఖ డీజీని కలిసి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఏబీసీడీలు తెలియకుండా యురేనియంపై హస్తిన దాకా పోలేదన్నారు. అసలు అఖిల పక్ష సమావేశానికి రేవంత్​రెడ్డికి ఆహ్వానం లేదని.. నాదెండ్ల మనోహర్​కు ఫోన్ చేసి అడిగి మరీ రేవంత్​రెడ్డి పిలిపించుకున్నారని ఆరోపించాడు. పవన్ కల్యాణ్​తో సెల్ఫీ దిగాల్సిన అవసరం లేదన్న సంపత్.. రాష్ట్రవ్యాప్తంగా తనతోనే స్వీయచిత్రాలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు. పవన్​కల్యాణ్​కు రేవంత్​రెడ్డి.. మూడు కాగితాలు ఇచ్చారేమో.. నేను ఇవ్వాలనుకుంటే ముప్పై కాగితాలున్నాయని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్​ ఎంపీగా ఉండి.. పవన్​కు నివేదిక ఇవ్వడమేంటని తాను అనడంలో తప్పేంముందని ప్రశ్నించారు.

కాంగ్రెస్​లో అవి చెల్లవు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం వద్ద రేవంత్​కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. హీరో, విలన్​, కమెడియన్​, క్యారెక్టర్​ ఆర్టిస్​ అన్నీ తానేనని రేవంత్​ అనుకుంటారని.. కాంగ్రెస్​లో అలాంటివి సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.

ఉత్తమ్​ పద్మావతే పైనల్​..

హుజూర్​నగర్ ఉపఎన్నికలో ఉత్తమ్ పద్మావతే తమ అభ్యర్థన్న సంపత్​..ఆమెను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి కావాలని ఎవరినీ అడగలేదని.. కానీ ఏఐసీసీ తన బయోడేటా అడిగినట్లు సంపత్​ పేర్కొన్నారు. ఎప్పుడూ రెడ్డి.. బీసీలకే పీసీసీ పదవులిస్తున్నారని.. ఎస్సీలకు కూడా పీసీసీ చీఫ్​ పదవి ఇవ్వాలని కోరారు. ​దామోదర రాజనర్సింహ పీసీసీకి అన్నివిధాల అర్హుడని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: హస్తంలో రాజుకున్న చిచ్చు

ABOUT THE AUTHOR

...view details