తెలంగాణ

telangana

శభాష్‌ కార్తికేయ.. అరుదైన ఘనత సాధించిన 13 ఏళ్ల బాలుడు

By

Published : Jul 29, 2022, 9:42 AM IST

mountaineer Karthikeya : హైదరాబాద్​లోని బోయిన్​పల్లికి చెందిన 13 ఏళ్ల బాలుడు అరుదైన ఘనత సాధించాడు. లద్దాఖ్‌లో గడ్డకట్టే చలిలో ఒక్కొక్కటి ఆరువేల మీటర్లకు పైగా ఎత్తున్న రెండు పర్వత శిఖరాలను అధిరోహించి వహ్వా అనిపించాడు. తమ కుమారుడు చిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం పట్ల ఆ అబ్బాయి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

karthikeya
విశ్వనాథ్‌ కార్తికేయ

mountaineer Karthikeya : పదమూడేళ్ల కుర్రాడు అబ్బురపరిచే ప్రతిభతో వహ్వా అనిపించాడు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ లద్దాఖ్‌లో గడ్డకట్టే చలిలో ఒక్కొక్కటి ఆరువేల మీటర్లకు పైగా ఎత్తున్న రెండు పర్వత శిఖరాలను అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. మార్ఖా లోయలో ఈ రెండు పర్వతాలు ఉన్నాయి.

జులై 11న తొలుత 6,270 మీటర్ల ఎత్తులోని కాంగ్‌ యాట్సే యాత్ర ప్రారంభించాడు. ఏడు రోజుల తర్వాత జులై 18న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి క్రాంపాస్‌ బేస్‌ పాయింట్‌ మీదుగా 6,240 మీటర్ల ఎత్తులోని ద్జో జోంగో పర్వతాన్ని జులై 20న అధిరోహించాడు. గడ్డకట్టే చలిలో ఏకధాటిగా రెండు పర్వతాలను అధిరోహించడం విశేషం. తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమారుడు చిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం పట్ల కార్తికేయ తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్‌, లక్ష్మి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను..పర్వతారోహణ సమయంలో గడ్డ కట్టే చలిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డానని కార్తికేయ తెలిపాడు. ‘ద్జో జోంగో శిఖరాగ్రం వద్ద మరీ ఇబ్బందిగా అనిపించింది. అమ్మ గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నా. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో యాత్ర విజయవంతంగా పూర్తి చేశా. తొలి నుంచీ గురువుల్లా ముందుండి..మార్గదర్శకత్వం వహించిన భరత్‌, రోమిల్‌ సహకారం లేకుంటే నా యాత్ర పూర్తయ్యేది కాదు’ అని వివరించాడు. భవిష్యత్తులో రష్యాలోని మౌంట్‌ ఎల్‌ బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నాడు. హైదరాబాద్‌లోని చైతన్య వద్ద కార్తికేయ తర్ఫీదు పొందాడు. ఉత్తరాఖండ్‌లోని పర్వతాలపై కొన్నాళ్లు సాధన చేశాడు.

ABOUT THE AUTHOR

...view details