తెలంగాణ

telangana

ETV Bharat / city

Aasara pension: ప్రభుత్వంపై నెలకు రూ.148 కోట్ల అదనపు భారం!

తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా వృద్ధాప్య పింఛన్ల(Aasara pension) కోసం 7.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరుతోపాటు అనర్హుల ఎరివేతకూ చర్యలు ప్రారంభించారు. కొత్త పింఛన్ల వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.148 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది.

By

Published : Sep 5, 2021, 6:39 AM IST

కొత్త ఆసరా పింఛన్లతో రూ.148 కోట్ల అదనపు భారం
కొత్త ఆసరా పింఛన్లతో రూ.148 కోట్ల అదనపు భారం

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వృద్ధాప్య పింఛన్ల కోసం(ఆసరా(Aasara pension)) 7.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం ఆగస్టు 31 గడువుగా దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో అర్హులైన లబ్ధిదారులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఓటర్ల జాబితా మేరకు క్షేత్రస్థాయిలో 57 ఏళ్లు నిండిన వారిని గుర్తించేందుకు సర్వే చేయగా దాదాపు 8 లక్షలకు పైగా అర్హులు ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా దరఖాస్తులు స్వీకరించగా 7.3 లక్షలకు పరిమితమైంది.

దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సమాయత్తమవుతోంది. అర్హులైన అందరికి పింఛన్లు(Aasara pension) లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులను తొలగించేందుకు చర్యలు చేపట్టనుంది. అర్హత కలిగిన ఒక కుటుంబసభ్యుడికి తప్పనిసరి పింఛను మంజూరు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆహార భద్రతాకార్డు, సామాజిక భద్రత, కుటుంబసర్వే తదితర వివరాలతో ప్రాథమిక పరిశీలన చేయనుంది. అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఈ పరిశీలనలో దరఖాస్తుదారుడి కుటుంబం, ఆదాయం, కుటుంబసభ్యుల వివరాలు, ఉద్యోగులుగా ఎంత మంది ఉన్నారు? సొంతిళ్లు, వాహనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఇప్పటికే నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి ఉంటే ఆసరాపింఛను మంజూరు చేయడం లేదా తిరస్కరించడంపై సెర్ప్‌ నిర్ణయం తీసుకోనుంది.

19 లక్షలకు చేరుతుందా?

రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతినెలా 37.48 లక్షల మంది వృద్ధాప్య(Aasara pension), వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల కింద నెలకు రూ.2,016 పింఛను మంజూరు చేస్తోంది. ఆగస్టు 31 నాటికి కొత్తగా వచ్చిన వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటే ఆసరా అర్హుల సంఖ్య 44.80 లక్షలకు చేరనున్నట్లు సమాచారం. కొత్త పింఛన్ల(Aasara pension) మంజూరుతో ఖజానాపై నెలకు రూ.148 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతానికి వృద్ధాప్య పింఛన్ల కింద 11.68లక్షల మంది అర్హులుంటే కొత్తగా చేరేవారితో కలిపి వృద్ధాప్య పింఛన్ల(Aasara pension) అర్హుల సంఖ్య 19లక్షలకు చేరే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details