ఏపీలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. సెకండ్ వేవ్లో తొలిసారి నిన్న 10 వేలు దాటిన కొవిడ్ కేసులు.. ఇవాళ 11వేల మార్క్ దాటింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు పది లక్షలు దాటాయి. కేసులతో పాటు క్రమంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 45,581 పరీక్షలు నిర్వహించగా.. 11,766 కేసులు నిర్ధరణ కాగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 10,09,228 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 11,766 కేసులు, 38 మరణాలు - కరోనా వైరస్ తాజా వార్తలు
ఏపీలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రికార్టుస్థాయిలో 11,766 కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది మరణించారు.
![ఏపీలో కొత్తగా 11,766 కేసులు, 38 మరణాలు AP CORONA CASES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11513322-942-11513322-1619184604541.jpg)
కొవిడ్తో నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,579కి చేరింది. 24 గంటల వ్యవధిలో 4,441 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,27,418కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,231 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,58,80,750 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,885, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి.