తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారికి, అధికార ప్రతినిధికి మధ్య వివాదం... ఆక్రమణే కారణం..! - adilabad latest news

ఆదిలాబాద్​లో జరుగుతున్న పట్టణప్రగతి వివాదానికి కేంద్ర బిందువైంది. కార్యక్రమంలో భాగంగా వార్టు సందర్శనకు వచ్చిన అడిషనల్​ కలెక్టర్​కు, వైస్​ఛైర్మన్​ మధ్య ఆక్రమణల విషయంలో మాటామాటా పెరిగి వివాదానికి దారి తీసింది. చెరువు అక్రమణకు గురవటం పట్ల వైస్​ ఛైర్మన్​ను అధికారి నిలదీయటం.. చర్చనీయాంశమైంది.

dispute between additional collector and municipal vice chairman at adilabad
dispute between additional collector and municipal vice chairman at adilabad

By

Published : Jul 10, 2021, 7:13 PM IST

అధికారికి, అధికార ప్రతినిధికి మధ్య వివాదం... ఆక్రమణే కారణం..!

ఆదిలాబాద్​లో చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమంలో చివరి రోజున వివాదం చోటుచేసుకుంది. పట్టణప్రగతి పనుల్లో భాగంగా వార్డు సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్​ డేవిడ్... పురపాలకపరిధిలోని ఖానాపూర్‌ చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు ఆక్రమణకు గురికావటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై.. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్​ వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌ను ప్రశ్నించారు. చెరువులోకి నీళ్లు వచ్చే నాలాలో చెత్తను వేయటం... అదే చెరువులో మట్టి వేస్తూ... కబ్జా చేయటంపై నిలదీశారు. కబ్జాలను అడ్డుకోవాల్సింది పోయి స్వయంగా ఆక్రమణలకు పాల్పడటం ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం..

ఈ కబ్జా వ్యవహారానికి బాధ్యత వహిస్తూ... ఆక్రమణలను తొలగించాలని అడిషనల్​ కలెక్టర్​ ఆదేశించగా... జహీర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు నిందిస్తున్నారని అడిషనల్​ కలెక్టర్​ను జహీర్​ ఎదురు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రాంతంలో ఇలా జరుగుతుంటే... అడ్డుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉంటుందని డేవిడ్​ తెలిపారు. నాలాలో చెత్త వేస్తే నీళ్లు ఎటు వెళ్తాయని.. చెరువులో మట్టి వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్​, మున్సిపల్​ కమిషనర్​ శైలజ... ఇద్దరికీ నచ్చజెప్పి సముదాయించారు.

ఆక్రమణలపై దృష్టి...

వైస్‌ ఛైర్మన్‌ తీరుపైన అడిషనల్‌ కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు బాధ్యున్ని చేయటం పట్ల అధికారిపై వైస్​ ఛైర్మన్​ గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద ఓ అధికారి, అధికారపార్టీ నేతకు మధ్య... ఆక్రమణల వ్యవహారంపై వివాదం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలపై అడిషనల్‌ కలెక్టర్‌ దృష్టిసారించడం ప్రస్తుతం పట్టణంలో హాట్‌ టాపిక్​గా మారింది.

ఇదీ చూడండి: మహిళా అధికారిణిపై మంత్రి వ్యాఖ్యలు వైరల్.. గీతారెడ్డి సీరియస్

ABOUT THE AUTHOR

...view details