ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంటే టీవీలకు అతుక్కుపోని వారు అంటూ ఎవరూ ఉండరు. ఐపీఎల్ మ్యాచ్లు, ప్రపంచ కప్లు, ఒలింపిక్స్ క్రీడలు సరేసరి. భారత్లో క్రీడలపై ఉన్న మమకారమే.. టీవీ క్రీడల మార్కెట్కు దన్నుగా నిలబడుతోంది. 2025-26 కల్లా ఈ మార్కెట్ రూ.9,830 కోట్లకు చేరొచ్చని సీసీఐ, కేపీఎమ్జీ, ఇండియా బ్రాడ్క్యాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్(ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం..
- భారత్లో క్రీడల వీక్షణ విషయంలో క్రికెట్దే ఆధిపత్యం. ఐపీఎల్ మ్యాచ్లు అత్యంత ప్రభావం చూపుతున్నాయి. కబడ్డీ, ఫుట్బాల్, ఖోఖో వంటి ఫ్రాంఛైజీ క్రీడలపైనా ఆసక్తి పెరిగింది.
- 2022 తొలి తొమ్మిది నెలల్లో భారత్లో క్రీడల వీక్షకులు 72.2 కోట్లకు చేరుకున్నారు. కరోనాకు ముందు నమోదైన 77.6 కోట్ల రికార్డును ఈ ఏడాది బద్దలుకావొచ్చు.
- క్రీడలకు డిజిటల్ ఆదాయాలు ఏటా 22 శాతం సమ్మిళిత వృద్ధి రేటును సాధిస్తున్నాయి. 2025-26కల్లా ఇవి మూడింతలై రూ.4,360 కోట్లకు చేరవచ్చు. డిజిటల్పై వ్యాపార ప్రకటనదార్లకు ఉన్న బలమైన ఆసక్తి వల్ల డిజిటల్ ప్లాట్ఫాంల నుంచి వ్యాపార ప్రకటనల ఆదాయాలు పెరుగుతున్నాయి.
- ఎక్కడైనా చూసే సౌకర్యం ఉండడంతో ఓటీటీ వీక్షకుల సంఖ్యలోనూ వృద్ధి కొనసాగనుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పెరుగుతుండడంతో క్రీడలకూ ఆ సబ్స్క్రిప్షన్ ఆదాయాలు పెరగనున్నాయి. సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్(ఎస్వీఓడీ) దిశగా ఓటీటీ ప్లాట్ఫారాలు వెళుతుండడం కూడా కలిసొచ్చే అంశం.