తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2022, 12:22 PM IST

ETV Bharat / business

వ్యాపార దిగ్గజం 'పల్లోంజీ మిస్త్రీ' కన్నుమూత.. మోదీ సంతాపం

Shapoorji Pallonji Mistry: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​ ఛైర్మన్​ పల్లోంజీ మిస్త్రీ గత రాత్రి కన్నుమూశారు. ఈయనకు నలుగురు సంతానం. పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగానూ 2016లో మిస్త్రీకి.. పద్మభూషణ్​ అవార్డు ఇచ్చింది కేంద్రం.

Shapoorji Pallonji Chairman Pallonji Mistry passes away at 93
Shapoorji Pallonji Chairman Pallonji Mistry passes away at 93

Shapoorji Pallonji Mistry: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ (93) ముంబయిలోని స్వగృహంలో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు షాపూర్జీ ప్రస్తుతం గ్రూపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు సైరస్‌ మిస్త్రీ గతంలో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక కుమార్తెలు లీలా, ఆలూ ఉన్నారు. వీరిలో ఆలూ ప్రముఖ పారిశ్రామిక వేత్త నోయల్‌ టాటా భార్య. పల్లోంజీ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగాను 2016లో ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. బ్లూమ్‌బర్గ్‌ అంచనాల ప్రకారం ఆయన సంపద విలువ రూ.2.2 లక్షల కోట్లు. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో 125వ స్థానంలో నిలిచారు. 2021లో ఆయన భారత్‌లోని సంపన్నుల్లో తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు.

షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ప్రధానంగా ఇంజినీరింగ్‌, నిర్మాణం, ఇన్​ఫ్రా,రియల్‌ ఎస్టేట్‌, వాటర్‌, ఎనర్జీ, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో సేవలు అందిస్తోంది. ముంబయిలోని ఆర్‌బీఐ భవనం, ది తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ నిర్మించింది పల్లోంజీ గ్రూపే. 1970లో పల్లోంజీ మిస్త్రీ ఈ సంస్థను పశ్చిమాసియాలోని అబుదాబి, ఖతర్‌, దుబాయ్‌లో విస్తరించారు. 1971లో ఒమన్‌ సుల్తాన్‌ ప్యాలెస్‌ సహా పలు కీలక భవనాలను ఈ సంస్థ నిర్మించింది. పల్లోంజీ మిస్త్రీ నేతృత్వంలో సంస్థ రియల్‌ ఎస్టేట్‌, వాటర్‌, ఎనర్జీ, ఫైనాన్షియల్‌ సేవల రంగాల్లో విస్తరించింది. 2004లో ఆయన కుమారుడు షాపూర్‌ మిస్త్రీకి సంస్థ బాధ్యతలు అప్పజెప్పారు.

పల్లోంజీ మిస్త్రీ

1865 స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ కింద మొత్తం 18 కంపెనీలు ఉన్నాయి. 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రూప్‌ 18.4శాతం షేర్లతో టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉంది.
పల్లోంజీ మిస్త్రీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ పారిశ్రామిక, వాణిజ్య రంగంలో మిస్త్రీ.. అపారమైన సేవలు చేశారని కొనియాడారు. మిస్త్రీ కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇవీ చూడండి:ఫాస్టాగ్​ నుంచి డబ్బుస్టాక్​ మార్కెట్లోకి తొలి అడుగు.. 'సూచీ ఫండ్ల'తో మేలు!

ఫాస్టాగ్​ నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యమా? ఆ వీడియోల్లో నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details