తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎంఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం చేయూత.. కొత్త విధానాలనూ తీసుకొస్తాం..

ఎంఎస్‌ఎమ్‌ఈలు ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టడమే కాకుండా.. ఎంఎస్‌ఎమ్‌ఈ రంగం సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు కొత్త విధానాలనూ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఉద్యమి భారత్‌’ కార్యక్రమంలో ఎంఎస్‌ఎమ్‌ఈల కోసం పలు పథకాలను ఆయన ప్రారంభించారు.

By

Published : Jul 1, 2022, 2:30 AM IST

PM MODI
PM MODI

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టడమే కాకుండా.. ఎంఎస్‌ఎమ్‌ఈ రంగం సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు కొత్త విధానాలనూ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఉద్యమి భారత్‌’ కార్యక్రమంలో ఎంఎస్‌ఎమ్‌ఈల కోసం పలు పథకాలను ఆయన ప్రారంభించారు. భారత ఎగుమతులు గణనీయంగా పెరగాలన్నా, భారత ఉత్పత్తులు కొత్త విపణుల్లోకి అడుగుపెట్టాలన్నా ఎంఎస్‌ఎమ్‌ఈ రంగం ఎంతో ముఖ్యమని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఎంఎస్‌ఎమ్‌ఈల ప్రోత్సాహానికి చర్యలను, పథకాలను ప్రభుత్వం తీసుకొస్తోందని తెలిపారు.

ఇవీ పథకాలు..

రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎమ్‌ఈల విస్తరణ, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ‘రైజింగ్‌ అండ్‌ యాక్సెలరేటింగ్‌ ఎంఎస్‌ఎమ్‌ఈ పర్‌ఫార్మెన్స్‌’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.6,000 కోట్లు వెచ్చించాలని ప్రణాళికగా పెట్టుకుంది. అంతర్జాతీయ విపణులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులను, సేవలను అందించేలా ఎంఎస్‌ఎమ్‌ఈలను ప్రోత్సహించేందుకు ‘కెపాసిటీ బిల్డింగ్‌ ఆఫ్‌ ఫస్ట్‌ టైమ్‌ ఎంఎస్‌ఎమ్‌ఈ ఎక్స్‌పోర్టర్స్‌’ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో దేశీయ ఎంఎస్‌ఎమ్‌ఈలు భాగస్వాములు అయ్యేందుకు, వాటి ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. ‘ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం’లోనూ (పీఎంఈజీపీ) కొన్ని సవరణలనూ ప్రభుత్వం చేసింది. తయారీ రంగానికి ప్రాజెక్టు గరిష్ఠ వ్యయాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సేవల రంగానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.

* 2022-23 సంవత్సరానికి గాను పీఎంఈజీపీ లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సబ్సిడీని ప్రధాని బదిలీ చేశారు. ఎంఎస్‌ఎమ్‌ఈ ఐడియా హ్యాకథాన్‌ ఫలితాలను వెల్లడించడంతో పాటు 2022 సంవత్సరానికి నేషనల్‌ ఎంఎస్‌ఎమ్‌ఈ అవార్డులను అందజేశారు. సెల్ఫ్‌ రిలయంట్‌ ఇండియా ఫండ్‌ కింద 75 ఎంఎస్‌ఎమ్‌ఈలకు డిజిటల్‌ ఈక్విటీ సర్టిఫికెట్‌లను కూడా ఇచ్చారు.

హామీ రహిత రుణాల్లో ముద్రా యోజన కీలక పాత్ర..

వ్యాపారం వైపు అడుగులు వేయాలనుకునే బలహీన వర్గాల వారికి హామీ లేకుండా రుణాలను పొందడం కష్టమవుతోందనే విషయాన్ని తాను గుర్తించినట్లు ప్రధాని చెప్పారు. అందుకే 2014 తర్వాత ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ నినాదం ద్వారా వ్యాపారాల ఏర్పాటుకు సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు సులువుగా వ్యాపారంలో అడుగుపెట్టేందుకు ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.19 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని, ఈ రుణ గ్రహీతల్లో సుమారు 7 కోట్ల మంది తొలిసారిగా వ్యాపారాన్ని ప్రారంభించిన వాళ్లేనని ఆయన చెప్పారు. ముద్రా యోజన కింద 36 కోట్ల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేయగా.. ఇందులో 70 శాతం వరకు మహిళా వ్యాపారులకే ఇచ్చారని ప్రధాని చెప్పారు. ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదైన వారిలోనూ 18 శాతానికి పైగా మహిళలేనని ప్రధాని తెలిపారు. పీఎంఈజీపీ కింద 2014 నుంచి 40 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవరు తొలిసారి రూ.1 లక్ష కోట్లను మించిందని చెప్పారు. ఖాదీ విక్రయాలు గత ఎనిమిదేళ్లలో 4 రెట్లు పెరిగాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details