సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్ఎమ్ఈలు) ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టడమే కాకుండా.. ఎంఎస్ఎమ్ఈ రంగం సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు కొత్త విధానాలనూ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఉద్యమి భారత్’ కార్యక్రమంలో ఎంఎస్ఎమ్ఈల కోసం పలు పథకాలను ఆయన ప్రారంభించారు. భారత ఎగుమతులు గణనీయంగా పెరగాలన్నా, భారత ఉత్పత్తులు కొత్త విపణుల్లోకి అడుగుపెట్టాలన్నా ఎంఎస్ఎమ్ఈ రంగం ఎంతో ముఖ్యమని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఎంఎస్ఎమ్ఈల ప్రోత్సాహానికి చర్యలను, పథకాలను ప్రభుత్వం తీసుకొస్తోందని తెలిపారు.
ఇవీ పథకాలు..
రాష్ట్రాల్లో ఎంఎస్ఎమ్ఈల విస్తరణ, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ‘రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎమ్ఈ పర్ఫార్మెన్స్’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.6,000 కోట్లు వెచ్చించాలని ప్రణాళికగా పెట్టుకుంది. అంతర్జాతీయ విపణులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులను, సేవలను అందించేలా ఎంఎస్ఎమ్ఈలను ప్రోత్సహించేందుకు ‘కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైమ్ ఎంఎస్ఎమ్ఈ ఎక్స్పోర్టర్స్’ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో దేశీయ ఎంఎస్ఎమ్ఈలు భాగస్వాములు అయ్యేందుకు, వాటి ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. ‘ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం’లోనూ (పీఎంఈజీపీ) కొన్ని సవరణలనూ ప్రభుత్వం చేసింది. తయారీ రంగానికి ప్రాజెక్టు గరిష్ఠ వ్యయాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సేవల రంగానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.