Ola Uber Complaints Issue Government: ఓలా, ఉబర్తో పాటు క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే అంశంలో మెరుగు పడకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణ రద్దు(రైడ్ కేన్సిల్) విధానంతో పాటు పలు అంశాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయమైన వాణిజ్య విధానాలను పాటిస్తున్నట్లు వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. బుకింగ్లను అంగీకరించిన అనంతరం, డ్రైవర్ల ఒత్తిడితో వినియోగదార్లు రైడ్ను రద్దు చేసుకోవడం వల్ల ఆ అపరాధ రుసుములను వినియోగదార్లు కట్టాల్సి వస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.
'వినియోగదార్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అందుకు సంబంధించిన గణాంకాలనూ ఇచ్చాం. ఆయా సంస్థలు తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని కోరాం. అలా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామ'ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సమావేశం అనంతరం పేర్కొన్నారు. క్యాబ్ అగ్రిగేటర్లు తక్షణం పరిష్కారాలతో ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. సమావేశంలో ఓలా, ఉబర్, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడడానికి వీరు నిరాకరించారు.
అధికారిక ప్రకటన ఇదీ.. 'వినియోగదార్ల ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థ ఉందని కంపెనీలు అంటున్నాయి. ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటామని చెప్పాయి. అన్ని కంపెనీలు ‘నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్’లో భాగస్వాములుగా మారాలని ఆదేశించామ'ని అధికారిక ప్రకటన తెలిపింది.
ఇవీ కొన్ని ఫిర్యాదులు.. 'ప్రయాణికుడు అంతక్రితం వెళ్లిన మార్గంలో మళ్లీ వెళ్లినపుడు, ఎక్కువ ఛార్జీ వసూలు చేయడం. ఫిర్యాదు అధికారి వివరాలే ఇవ్వకపోవడం. కేన్సిలేషన్ ఛార్జీల విషయంలో ఎంత సమయంలోగా రైడ్ను రద్దు చేసుకుంటే ఛార్జీలు వర్తించవో స్పష్టత ఇవ్వడం లేదు. రద్దు ఛార్జీలు కూడా స్థిరంగా ఉండడం లేదు. రైడ్కు ముందే వాటిని తెలపకపోవడం' వంటివి దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పాయింట్ 'ఎ' నుంచి పాయింట్ 'బి'కి వెళ్లడానికి వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ఛార్జీలు ఎందుకని ప్రశ్నించినట్లు సింగ్ పేర్కొన్నారు. 'పాత వినియోగదార్లకు ఎక్కువ, కొత్త వినియోగదార్లకు తక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇది న్యాయసమ్మత ధోరణి కాదు. అదే సమయంలో వినియోగదార్ల డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకున్నాయా లేదా అన్నదీ తెలుసుకోవాలనుకుంటున్నామ'న్నారు.