తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2023, 9:31 AM IST

ETV Bharat / business

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ.. వరల్డ్​లో ఆయన ర్యాంక్ ఎంతంటే..

ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఇందులో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

mukesh ambani
mukesh ambani

2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతేడాది 90.7 బిలియన్​ డాలర్ల సంపదతో 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది ఓ మెట్టు పైకి ఎక్కారు.

తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్- సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జూకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముకేశ్​ అంబానీ ఎగువ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్​లోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగిన గౌతమ్​ అదానీ.. తన కంపెనీల షేర్ల ధరలు పతనమైన కారణంగా ఈ ఏడాది 24వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 47.2 బిలియన్ డాలర్లని అంచనా.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ సంపద విలువ 25.6 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్లోబల్ ర్యాంకుల్లో 55 స్థానంలో ఉన్న నాడార్​.. ఫొర్బ్స్​ జాబితాలో నమోదైన భారతీయులలో మూడవ వ్యక్తిగా నిలిచారు. గతేడాది ఉన్న సంపన్నుల జాబితాతో పోలిస్తే.. ప్రపంచంలో ఉన్న బిలియనీర్ల సంపద ఇప్పుడు 12.2 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. మార్చి 2022లో 12.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న సంపదలో ఈ ఏడాదికి 500 బిలియన్​ డాలర్ల తగ్గుదల నమోదైంది.

ఫోర్బ్స్ జాబితాలోని ప్రపంచ బిలియనీర్ల సంఖ్య గత ఏడాది 2,668గా ఉంది. 2023 నాటికి ఆ సంఖ్య 2,640కి పడిపోయింది. మరోవైపు భారత్​లోని బిలీయనీర్ల సంఖ్య 2022లో ఉన్న 166 నుంచి ఈ ఏడాది 169కు చేరుకుంది. స్టాక్‌ విలువ పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల సంఖ్య తగ్గేందుకు కారణాలని ఫోర్బ్స్ పేర్కొంది.

ఇక అత్యంత సంపన్నులు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూమరు 4.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో 735 మంది సభ్యులున్నారు. మరోవైపు హాంకాంగ్, మకావుతో పాటు చైనా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అక్కడి కుబేరుల అందరి సంపద విలువ కలిపి రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య సుమారు 562. ఇక మూడో స్థానాన్ని భారత్​ సొంతం చేసుకుంది. భారత్​లో సుమారు 169 మంది బిలీయనీర్లు ఉన్నారు. వీరి సంపద విలువ సుమారు 675 బిలియన్ డాలర్లు.

ABOUT THE AUTHOR

...view details