Go First airlines latest news : వాడియా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ గోఫస్ట్ మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిధుల కొరత కారణంగానే సర్వీసులు నిలివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్లే.. నిధుల కొరత తలెత్తినట్లు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. దాంతోపాటు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు ఆయన వెల్లడించారు.
సంస్థకు చెందిన 28 విమానాల సేవలు నిలిచిపోయాయని కౌశిక్ పేర్కొన్నారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్ల సరఫరా చేయలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. దీంతో నిధుల కొరత ఏర్పడిందని వివరించారు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కౌశిక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు తెలియజేసినట్లు కౌశిక్ పేర్కొన్నారు. దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదించినట్లయితే.. విమాన సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.