ELON MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుమారుడు తన పేరును మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకొని ఆమెగా మారిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా పేరును కూడా మార్చాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తద్వారా తన తండ్రితో ఉన్న బంధాన్ని తెంచుకోనున్నట్లు వెల్లడించారు. 'వివియన్ జెన్నా విల్సన్' పేరుతో పాటు, కొత్తగా జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్-జస్టిన్ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు. దీంతో తన పేరుతో పాటు లింగమార్పిడిని గుర్తిస్తూ కొత్త జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని కోరుతూ అమెరికా శాంటా మోనికాలోని లాస్ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్లో ఈ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్ వెల్లడించారు. అయితే, ఆయనతో ఆమెకున్న విభేదాలపై మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు తన ట్రాన్స్జెండర్ కుమార్తెపై అటు ఎలాన్ మస్క్ నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు.