తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2022, 3:41 PM IST

ETV Bharat / business

లోన్​ యాప్స్​ కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం- ఇక అవన్నీ బ్యాన్!

ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే రుణ యాప్‌ల దారుణాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధమైన లోన్​ యాప్​లు మాత్రమే గూగుల్, యాపిల్​ యాప్ స్టోర్స్​లో ఉండేలా చూసేందుకు మార్గదర్శకాలు రూపొందించింది.

loan apps in india
లోన్​ యాప్స్​ కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధిస్తున్న లోన్​ యాప్​కు ముకుతాడు వేసేలా కేంద్రం కీలక ప్రణాళిక రచించింది. అక్రమ లోన్​ యాప్స్​ అసలు యాప్ స్టోర్స్​లో కనిపించకుండా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చట్టబద్ధమైన లోన్​ యాప్​ల వివరాలతో వైట్​ లిస్ట్ తయారు చేయాలని రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ ఆదేశించింది. లోన్​ యాప్​ల ఆగడాలు అంతకంతకూ ఎక్కువై, అనేక మంది రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. శుక్రవారం దిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం లోన్​ యాప్​ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు.

రిజర్వు బ్యాంకు తయారు చేసిన వైట్​ లిస్ట్​లోని లోన్​ యాప్​లు మాత్రమే ఆండ్రాయిడ్, యాపిల్ యాప్​ స్టోర్స్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయించారు. అక్రమ లోన్​ యాప్​ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. చట్టవిరుద్ధ రుణ యాప్​ల లావాదేవీలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

Loan Apps Frauds: ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే రుణ యాప్‌ల దారుణాలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వడ్డీలతో బాదుతూ, సకాలంలో చెల్లించలేదనే పేరిట తీవ్రస్థాయి వేధింపులకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 1,110కు పైగా రుణ యాప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 600 యాప్‌లు ఎలాంటి లైసెన్సు లేకుండానే అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంకు గత ఏడాది నవంబర్‌లో తేల్చిచెప్పడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ తరహా యాప్‌లను చైనా, సింగపూర్‌, ఇండొనేసియాలకు చెందిన విదేశీయులు నడిపిస్తున్నారు. భారీసంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠ నియంత్రణ చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వడ్డీల ఊబిలో:గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఆన్‌లైన్‌ రుణ యాప్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. చిరుద్యోగులు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువత అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు భారీ వడ్డీకి సైతం వెరవకుండా రుణ యాప్‌ల నుంచి అప్పు తీసుకుంటున్నారు. పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలిస్తుండటంతో ఎక్కువమంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. సకాలంలో రుణాలు తీర్చలేనివారిని నిర్వాహకులు మానసికంగా హింసిస్తున్నారు. రుణం తీసుకునేటప్పుడే ఫోన్‌లోని కాంటాక్టు జాబితా, ఫొటోలను ఉపయోగించుకోవడానికి యాప్‌ అనుమతి అడుగుతుంది. అనుమతిస్తేనే రుణం తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా చాలా యాప్‌లు వారం, పది రోజుల్లో తిరిగి తీర్చాలనే షరతుతో రుణం ఇస్తాయి. సకాలంలో తీర్చకపోతే ఫోన్‌లోని నంబర్లన్నింటికీ అప్పు ఎగ్గొట్టారనే సందేశాలు పంపుతారు. అప్పటికీ బాకీ వసూలు కాకపోతే ఫొటో కింద శ్రద్ధాంజలి అని రాసి అన్ని నంబర్లకూ పంపిస్తారు. ఆ తరవాత అసభ్య పదజాలంతో దూషిస్తూ సందేశాలు వెళతాయి. ఇలా రుణం తీర్చేవరకు వేధింపులు కొనసాగుతాయి. ఇందుకోసం పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుని కాల్‌సెంటర్లు నడుపుతున్నారు.

యాప్‌ల ద్వారా తీసుకునే రుణాలకు భారీ వడ్డీ విధిస్తున్నారు. చాలా యాప్‌లు రూ.10 వేలు రుణం తీసుకుంటే రెండువేల రూపాయల నుంచి రూ.2,800 వరకు వడ్డీ ముందే తీసేసుకుంటున్నాయి. చెల్లింపు గడువు వారం నుంచి నెలదాకా ఉంటుంది. గడువు తీరినా అప్పు తీర్చలేనివారికి మరో యాప్‌ ద్వారా వారే రుణం ఇస్తారు. దానికి అంతకంటే మరింత ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఇదో గొలుసుకట్టులా మారి చివరకు చేసిన అప్పు కంటే కొన్నిరెట్లు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తోంది. తాను రూ.10 వేల రుణం తీసుకుంటే యాప్‌ నుంచి యాప్‌నకు మారుతూ వెళ్లేసరికి రూ.73వేలు వడ్డీ కట్టానని, ఇంకా అసలు కట్టాలని వేధిస్తున్నారంటూ ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడం దోపిడీ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. గడువులోగా ఈ అప్పులు తీర్చలేక, నిర్వాహకుల వేధింపులు తాళలేక తెలంగాణలో 10 మందికి పైగా బలవన్మరణానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గతేడాది పోలీసులు యాప్‌ నిర్వాహకులపై కేసులు పెట్టి, కాల్‌సెంటర్లు మూయించారు. దీంతో అసలు యజమానులు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇటీవల మళ్లీ పాతబుద్ధి చూపించడం ప్రారంభించారు. అయిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసింది ఇతనేనంటూ హైదరాబాద్‌కు చెందిన రుణ బాధితుడి బంధుమిత్రులందరికీ సందేశాలు పంపి వేధించారు. అప్పు తీసుకున్న నాలుగు రోజులకే ఓ మహిళా రుణగ్రహీత ఫొటోను నగ్నచిత్రాలతో మార్ఫింగ్‌ చేసి బంధుమిత్రులకు పంపడం రుణయాప్‌ నిర్వాహకుల దురాగతాలకు పరాకాష్ఠ.

ABOUT THE AUTHOR

...view details