గ్యాడ్జెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్మీ కే30 స్మార్ట్ఫోన్ను నేడు చైనాలో విడుదల చేయనుంది షియోమీ సంస్థ. గతంలో ఈ ఫోన్ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగానే.. రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.
ఫీచర్స్...
- 5జీ, 4జీ నెట్వర్క్ వేరియంట్లు
- ఎమ్ఐయూఐ 11- అండ్రాయిడ్ 10
- 512జీబీ స్టోరేజ్
- 12జీబీ ర్యామ్
- 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 3.5 ఎమ్ఎమ్ హెడ్ఫోన్ జాక్
- డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్
- మూడు రంగులు
డ్యూయల్ మోడ్ 5జీ అంటే?
5జీ నెట్వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. దీన్ని 5జీ నాన్ స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీ ఎన్ఎస్ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్వర్క్ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్వర్క్లను వాడేందుకు వీలుగా రెడ్మీ కే30 మోడల్ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
భారత్కు రెడ్మీ కే30?
ఈ ఫోన్ భారత్లో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే భారత్లో ఇప్పటి వరకు 5జీ నెట్వర్క్ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్మీ కే30 4జీ వేరియంట్ను భారత్లో విడుదల చేసే అవకాశమున్నట్లు పలు టెక్ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.